Wednesday, July 31, 2019

కేసీఆర్‌కు చెప్పి సస్పెండ్ చేయిస్తా: పోలీసులకు వైసీపీ ఎమ్మెల్యే భార్య వార్నింగ్

కేసీఆర్‌కు చెప్పి సస్పెండ్ చేయిస్తా: పోలీసులకు వైసీపీ ఎమ్మెల్యే భార్య వార్నింగ్
31-07-2019 13:26:30

హైదరాబాద్: కృష్ణాజిల్లా, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కుటుంబసభ్యులు మాదాపూర్‌ ట్రాఫిక్ పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో వైసీపీ ఎమ్మెల్యే సతీమణి విమలా భానుతోపాటు కుమార్తె, అల్లుడు ఉన్నారు. మహిళలను నెట్టడం సరికాదని.. సీఎం కేసీఆర్‌తో చెప్పి సస్పెండ్ చేయిస్తానని ట్రాఫిక్ పోలీసులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాదాపూర్ ఖానామిట్ట వద్ద ట్రాఫిక్ పోలీసులు విధినిర్వహణలో ఉన్నప్పుడు కొన్ని వాహనాలను ఆపారు. ఆ వాహనాల్లో ఎమ్మెల్యే ఉదయభాను కుమారుడు ప్రసాద్ వాహనం కూడా ఉంది. పోలీసులు తమ వాహనాన్ని అన్యాయంగా ఎక్కువసేపు ఆపారంటూ ప్రసాద్ పోలీసులతో గొడవపడ్డారు. దీంతో పోలీసులు సర్దిచెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ప్రసాద్ వినకుండా ఘర్షణకు దిగుతూ.. విధుల్లో ఉన్న ట్రిఫిక్ ఎస్ఐపై దాడి చేసి కాలితో తన్నారు. ఎస్ఐ పిర్యాదు మేరకు ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని మాదాపూర్ పీఎస్‌కు తరలించారు. ఇది జరిగిన కొద్ది నిముషాలకే ఎమ్మెల్యే ఉదయభాను కుటుంబసభ్యులు వచ్చి ఎస్ఐ రాజగోపాల్ రెడ్డితో గొడవకు దిగారు. వారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Monday, July 22, 2019

World Bank ‘అమరావతి రుణం’ మరో ప్రాజెక్టుకు!

World Bank ‘అమరావతి రుణం’ మరో ప్రాజెక్టుకు!
Jul 21, 2019, 03:09 IST
 World Bank officials informed the state government about funding - Sakshi
300 మిలియన్‌ డాలర్ల రుణం ఇస్తాం

అవసరమైతే సాయాన్ని మరింత పెంచుతాం

ప్రాధామ్యాలను నిర్ణయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు సమాచారం

నవరత్నాలకు చేయూత అందిస్తాం

ప్రజల జీవన ప్రమాణాలను పెంచే పథకాలకు సాయపడతామన్న బ్యాంకు

గత సర్కారు నిబంధనలను ఉల్లంఘించటం వల్లే రుణంపై వెనక్కి తగ్గిన వైనం

అమరావతి రహదారుల టెండర్లలో అక్రమాలపై తనిఖీ బృందాలతో ఆరా

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం మంజూరు నుంచి తాము వైదొలిగినప్పటికీ ఇతర ఏ పట్టణ ప్రాజెక్టుకైనా సరే రుణం మంజూరు చేస్తామని, ప్రాధామ్యాల ఆధారంగా దీనిపై నిర్ణయించుకోవాలని ప్రపంచ బ్యాంకు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. మరో ప్రాజెక్టును సూచిస్తే 300 మిలియన్‌ డాలర్ల రుణాన్ని అందిస్తామని ప్రపంచ బ్యాంకు ప్రతిపాదించినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అవసరమైతే సాయాన్ని మరింత పెంచుతామని కూడా హామీ ఇచ్చింది. అమరావతి ప్రాజెక్టుకు రుణం మంజూరు నుంచి తప్పుకోవడంపై ప్రపంచ బ్యాంకు అధికారులు ఈమేరకు స్పందించినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలకు చేయూత అందిస్తామని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే పథకాలకు సాయం అందిస్తామని ప్రపంచబ్యాంకు వర్గాలు పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

రుణం రాకముందే రోడ్ల టెండర్లా?
అమరావతి ప్రాజెక్టుకు రుణం మంజూరు నుంచి ప్రపంచ బ్యాంకు వైదొలగడానికి చంద్రబాబు సర్కారు వైఫల్యాలతోపాటు బ్యాంకు నియమ నిబంధనలను ఉల్లంఘించడమే ప్రధాన కారణాలు. ప్రపంచ బ్యాంకు రుణం మంజూరు చేయకముందే గత సర్కారు రహదారుల పనులకు టెండర్లను ఆహ్వానించడమే కాకుండా ఖరారు కూడా చేసింది. అనంతరం టెండర్ల వివరాలను పరిశీలించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఇందులో కాంట్రాక్టు సంస్థలు కుమ్మక్కు అయినట్లు స్పష్టం అవుతోందని, దీనిపై వివరణ ఇవ్వాలని సీఆర్‌డీఏను కోరారు. ఈ నేపథ్యంలో ల్యాండ్‌ పూలింగ్‌లో అక్రమాలు, వ్యవసాయ భూములను పెద్ద ఎత్తున సేకరించి ఇతర అవసరాలకు వినియోగించడం, రైతు కూలీలు జీవనోపాధి కోల్పోవడం, పర్యావరణ విపత్తులు, రాజధానిలో కృష్ణా నది వరదల ప్రభావం తదితర అంశాలపై ప్రపంచ బ్యాంకు క్షేత్రస్థాయి తనిఖీలను నిర్వహించడంతో పాటు విచారణ జరిపించింది. చంద్రబాబు సర్కారు వాస్తవాలను కప్పిపుచ్చినట్లు గుర్తించిన ప్రపంచ బ్యాంకు తనిఖీల కోసం బృందాన్ని అమరావతికి పంపింది. రుణం మంజూరు కూడా కాకముందే ప్రపంచ బ్యాంకు బృందం అమరావతి ప్రాజెక్టుపై విచారణ చేయడం పట్ల కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం విస్మయం వ్యక్తం చేసింది.

తనిఖీల తరువాతే బ్యాంకు నిర్ణయం..
– రాజధాని అమరావతి ప్రాజెక్టుకు రుణం కోరుతూ 2016 అక్టోబరు 8న చంద్రబాబు సర్కారు కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగానికి ప్రతిపాదనలు పంపింది. 2017 జూన్‌ 12న ఈ ప్రతిపాదన రిజిస్టర్‌ అయింది.
– మొత్తం ప్రాజెక్టు విలువ 715 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు కాగా దీని విలువ మన రూపాయల్లో ఇంచుమించు రూ.5 వేల కోట్లు.
– ఇందులో వరల్డ్‌ బ్యాంకు వాటా రూ.2100 కోట్లు, ఏసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు వాటా రూ.1,400 కోట్లు కాగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వాటా రూ.1500 కోట్లు.
– ప్రపంచ బ్యాంకు నుంచి రుణం మంజూరు కాకముందే 2017–2018లో రాజధానిలో రహదారి నిర్మాణ పనులను హడావుడిగా కాంట్రాక్టర్లకు అప్పగించేశారు.
– 92 కిలోమీటర్ల మేర రోడ్లు వేయడానికి రూ.1,872 కోట్లు, ముంపు నివారణకు కాలువలు, రిజర్వాయర్‌ పేరిట రూ. 947 కోట్ల విలువైన పనులు అప్పగించారు.
– టీడీపీ ప్రభుత్వం అప్పగించిన వాటిల్లో 7 పనులు రెట్రోయాక్టివ్‌ ఫైనాన్సింగ్‌ విధానానికి విరుద్ధంగా ఉన్నాయని ప్రపంచబ్యాంకు అభ్యంతరం తెలిపింది. అయినా సరే చంద్రబాబు సర్కారు దీన్ని పట్టించుకోకుండా చాలా పనులు కాంట్రాక్టర్లకు కట్టబెట్టింది.
– రాజధాని ప్రాంతంలో చంద్రబాబు సర్కారు తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడుతోందని, అన్ని రకాల చట్టాలను ఉల్లంఘిస్తోందని ప్రపంచ బ్యాంకుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఇలా ఫిర్యాదు చేసిన వారిలో గత సర్కారు బాధితులు, రైతులు, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలున్నారు.
– దీనిపై వాస్తవాలను నిర్థారించుకునేందుకు ప్రపంచ బ్యాంకుకు చెందిన ఐఏఎం, ఇండిపెండెంట్‌ అకౌంటబులిటీ మెకానిజం 2017 సెప్టెంబరు 13 నుంచి 17 వరకు రాజధాని ప్రాంతంలో పర్యటించింది. అమరావతి ప్రాజెక్టు డిజైన్, పర్యావరణం, రాజధానిలో నివసిస్తున్న బడుగు, బలహీనవర్గాల స్థితిగతుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న అంశాలపై పరిశీలన, తనిఖీలు జరిపింది. తొలుత 2017 సెప్టెంబరు 27న నివేదిక ఇవ్వగా అనంతరం అదే ఏడాది నవంబర్‌ 27న సవరించింది. ఆ తరువాత 2018 జూన్‌ 26న మరోసారి సవరించగా చివరగా ఈ ఏడాది మార్చి 29న నివేదికను ఖరారు చేసింది.
– ప్రపంచబ్యాంకుకు చెందిన ఐదు విభిన్న బృందాలు తమకు అందిన ఫిర్యాదులపై  క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి భారీగా సమాచారాన్ని సేకరించాయి. ఇందులో ఇద్దరు ప్రతినిధులు చాలా ఘాటుగా ప్రపంచబ్యాంకుకు నివేదిక ఇచ్చారు. రాజధాని రైతులు జీవనోపాధి కోల్పోతున్నారని, కౌలు రైతులను పట్టించుకోలేదని, నిరుద్యోగాన్ని సృష్టించారని, వ్యవసాయం దెబ్బతిందని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని సృష్టించారని, పర్యావరణం మీద తీవ్రమైన ప్రభావం చూపుతోందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, తనిఖీ బృందాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. వీటిపై సరైన వివరణలు కూడా ఇవ్వలేదు. దీంతో పూర్తిస్థాయి బృందంతో విచారణ చేయాలని తనిఖీ బృందం ప్రపంచబ్యాంకుకు సిఫార్సు చేసింది. ప్రాజెక్టు మంజూరు కాకముందే ఇలాంటి విచారణకు ఆదేశించడం గతంలో దేశంలో ఎప్పుడూ, ఎక్కడా జరగకపోవడం గమనార్హం.

Tuesday, July 9, 2019

ఖబడ్దార్‌.. దాడులు, హత్యలు, ఆస్తులు ధ్వంసం చేస్తే సహించం

ఖబడ్దార్‌.. దాడులు, హత్యలు, ఆస్తులు ధ్వంసం చేస్తే సహించం
7/10/2019 4:37:31 AM
పొలిటికల్‌ టెర్రరిజం మంచిది కాదు
ధర్మవరం ఎమ్మెల్యే అరాచకాలు మితిమీరాయి
ఎన్నికలు ఎప్పుడు పెట్టినా టీడీపీ ప్రభంజనం సృష్టిస్తుంది
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు
ధర్మవరం, జూలై 9 : రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలకు వైసీపీ నుంచి ఎటువంటి ఆపద ఎదురైనా వారిని కాపాడుకునే బాధ్యత నాదేనని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. వైసీపీ వర్గీయులు టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, హత్యలు, ఆస్తులు ధ్వంసం చేస్తే ఖబడ్దార్‌ అంటూ హెచ్చరించారు. మంగళవారం వైసీపీ నాయకుల చేతిలో హత్యకు గురైన కుటుంబాలకు భరోసా కల్పించి ఆర్థిక సాయం అందించడంలో భాగంగా చంద్రబాబు జిల్లా పర్యటనకు విచ్చేశారు. ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం పత్యాపురంలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త రాజు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందించగా, గాయపడిన మరో ఆరుగురికి రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. బాధిత కుటుంబీకుల పిల్లలను ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు ద్వారా చదివిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ధర్మవరం పట్టణానికి చేరుకుని మృతి చెందిన చేనేత కార్మికుడు చంద్రశేఖర్‌ కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేసి, వారి పిల్లలను కూడా చదివిస్తానని హామీ ఇచ్చారు. కాగా ధర్మవరంలో కార్యకర్తల సమావేశం నిర్వహించాల్సి ఉంది. భారీ ఎత్తున కార్యకర్తలు, ప్రజలు, చేనేత కార్మికులు తరలిరావడంతో కల్యాణమండపం పట్టలేదు. దీంతో బహిరంగ సభగా మార్చాల్సి వచ్చింది.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, హత్యా రాజకీయాలు మితిమీరిపోతున్నాయన్నారు. ప్రజలను చంపే అధికారం ఎవరికీ లేదన్నారు. వైసీపీ నాయకుల దాడుల్లో నష్టపోయిన తెలుగుదేశం కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రతిపక్ష నేతగా మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తనదేనన్నారు. ధర్మవరం ఎమ్మెల్యేతో పాటు కొందరు వైసీపీ నాయకులకు ఖబడ్దార్‌, జాగ్రత్త అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. దాడులు మానుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. 2009లో ఇక్కడ ఒకాయనను నియోజకవర్గ ఇన్‌చార్జిగా చేసి 2014లో మీరందరూ ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే... ఇప్పుడు నాకే నీతులు చెప్పి మిమ్మల్ని నట్టేట ముం చి వెళ్లిపోయారన్నారు. ఎవరు వెళ్లినా ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీ శాశ్వతమన్నారు. ధర్మవరంలో కార్యకర్తల నాడి చూడాలని మీటింగ్‌ పెడితే బహిరంగ సభగా మార్చాల్సి వచ్చిందన్నారు. ఇంత రాత్రి పూట కూడా వేలాదిగా తరలివచ్చి తనకు మద్దతు పలకడం మరచిపోలేనిదన్నారు. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృ ష్టిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో దారి పొడవునా వందలాది మంది ఆశీర్వదిస్తూ మా ఓట్లు మీకే వేశాం.. అవి ఎక్కడికెళ్లా యో అడగడానికి వచ్చామని ప్రజలు పేర్కొంటున్నారన్నారు.

ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోం
ధర్మవరంలో ప్రతిపక్షమే లక్ష్యంగా చేసుకుని వైసీపీ ఆస్తులను ధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని చంద్రబాబు అన్నారు. ఆక్రమణలు ఏవైనా ఉంటే మొదట మీవారి ఆక్రమణలు తొలగించిన తర్వాత మా వారివి తొలగిస్తే ప్రతి ఒక్కరూ స్వాగతిస్తారన్నారు. అలా కాకుండా ప్రతిపక్ష నాయకులను టార్గెట్‌ చేసుకుని వారిని బలహీనపరచడం కోసం ధర్మవరం వైసీపీ నాయకులు సొంత స్థలంలో ఉన్న నిర్మాణాలు సైతం తొలగించడం మంచిది కాదన్నారు. ధర్మవరానికి చెందిన దేవరకొండ రామకృష్ణ, నాగరాజు, మరికొందరు గృహాలను కూల్చివేయడంతో పాటు చీనీ చెట్లను నరికి వేయడాన్ని ఈ సందర్భంగా ఉదహరించారు. చంద్రబాబు వెంట మాజీ మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఉమామహేశ్వరరావు, పరిటాల శ్రీరామ్‌, మాజీ మేయర్‌ స్వరూప, సబిత, చిగిచెర్ల ఓబిరెడ్డి, కమతం కాటమయ్య, గరుగు వెంగప్ప, సనత్‌, అత్తార్‌ రహీంబాషా, మాజీ జడ్పీటీసీలు విశాలాక్షి, మేకల రామాంజనేయులు ఉన్నారు.

బొల్లినేని శ్రీనివాస్‌పై సీబీఐ దాడులు

బొల్లినేని శ్రీనివాస్‌పై సీబీఐ దాడులు
Jul 09, 2019, 19:41 IST
 CBI Attacks On Bollineni Srinivas Rao - Sakshi
జీఎస్టీ సీనియర్ అధికారి బొల్లినేనిపై అక్రమాస్తుల ఆరోపణలు

భారీగా ఆస్తులను గుర్తించిన సీబీఐ అధికారులు

ఎంపీ సుజనా చౌదరీ కేసులో ఫైళ్ల మార్పు

ఆయన భార్య బొల్లినేని శిరీషపై కూడా కేసు నమోదు

సాక్షి, హైదరాబాద్‌: జీఎస్టీ సీనియర్ అధికారి బొల్లినేని శ్రీనివాస్ గాంధీపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఏకకాలంలో విజయవాడ, హైదరాబాద్‌ కార్యాలయాలతో పాటు ఆయన నివాసంలో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్నా ఆరోపణలతో అధికారులు తొలుత ఆయనపై కేసు నమోదు చేసి.. దాడులు చేపట్టారు. రూ. 200 కోట్లు అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని ఆయనపై అభియోగాలు మోపబడ్డాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడైన శ్రీనివాస్‌.. పదేళ్లకు పైగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లో పనిచేసిన అనుభవం ఉంది. ప్రసుత్తం ఆయన జీఎస్టీ సీనియర్ అధికారిగా పని చేస్తున్నారు. ఇప్పటి వరకు  ఆయన వద్ద నాలుగు కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. గాంధీతో పాటు ఆయన భార్య బొల్లినేని శిరీషపై కూడా కేసు నమోదు చేశారు.

రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరీకి సంబంధించిన కేసును విచారణ చేసిన గాంధీ.. చంద్రబాబు సూచనల మేరకు పలు ఫైళ్లల్లో మార్పులు చేసినట్టు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు ఆయనపై ఈడీ, కేంద్ర ఆర్థిక శాఖ, పీఎంవో  కార్యాలయం నుంచి అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో సీబీఐ అధికారులు దాడులను ముమ్మరం చేశారు. గతంలో హైదరాబాద్‌ ఈడీ కార్యాలయం నుంచి బదిలీ అయినా.. అనధికారికంగా నెలరోజుల పాటు విధుల్లో కొనసాగారని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో అనేక మంది టీడీపీ నేతలకు అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకోడానికి సహకరించినట్లు ఆయనపై అభియోగాలు మోపబడ్డాయి.

భారీగా అక్రమాస్తుల గుర్తింపు..
ఆయనపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఐపీసీ సెక్షన్ 109,13(2),13(1బీ) ప్రకారం అధికారులు కేసు నమోదు చేశారు. హోదాను అడ్డుపెట్టుకుని అక్రమాస్తులు సంపాదించినట్లు విచారణలో తెలుస్తోంది. విజయవాడ, గుంటూరు, హైదరాబాద్‌లో భారీగా ఆస్తులు ఉన్నట్లు తెలుసింది. అధికారులు ఇ‍ప్పటి వరకు గుర్తించిన ఆస్తుల వివరాలు... కంకిపాడులో మూడు స్థలాలు, ప్రొద్దుటూరులో ఇళ్లు, కానూరులో 360 గజాల స్థలం, రంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్‌లో 300 గజాల స్థలం, మరో రెండు స్థలాలు,  మదీనా గూడలో పది కుంటలు, విజయవాడ కంకిపాడులో 43 సెంట్లు, తుళ్లూరులో 42 సెంట్ల స్థలం,  కంకిపాడులో 2.96 సెంట్ల స్థలం, బ్యాంకు ఖాతాలో భారీగా నగదును గుర్తించారు. కూకట్పల్లి యాక్సిస్ బ్యాంక్ అకౌంట్లో రూ‌‌.20 లక్షలు, బంధువులు నరసింహారావు,శ్రీలత ఖాతాలో పది‌లక్షల నగదు, కుంటుబ సభ్యులపై ఫిక్సడ్ డిపాజిట్లు చేసినట్లు తెలిసింది.

సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో 1992లో విధుల్లో చేరిన గాంధీ.. 2002లో సూపరింటెండెండ్‌గా ప్రమోషన్ రావడంతో హైదరాబాద్ కమిషనరేట్‌లో చేరారు. 2003లో డీఆర్ఐలో చేరారు. 2004 నుంచి 2017 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లో పని చేశారు. ప్రసుత్తం ఆయన జీఎస్టీ సీనియర్ అధికారిగా కొనసాగుతున్నారు. 

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వం.. తేల్చి చెప్పిన కేంద్రం

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వం.. తేల్చి చెప్పిన కేంద్రం
09-07-2019 20:36:01

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పింది. ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక సాయం మాత్రమే చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే ఏపీకి ప్రత్యేక సాయం ప్రకటించామని కేంద్రం తెలిపింది. పార్లమెంట్‌లో ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అడిగిన ప్రశ్నకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థికసంఘం సిఫార్సులతో హోదా అంశం మరుగునపడిందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పరిష్కారం కాని అంశాలపై దృష్టిపెట్టామని తెలిపారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని నిత్యానందరాయ్ ప్రకటించారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా కోరారు కూడా. అయినప్పటికీ కేంద్రం ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదు. తొలి నుంచీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్న కేంద్రం.. ఇప్పుడు కూడా అదే విషయాన్ని స్పష్టం చేసింది.


సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు సత్వరమే ప్రత్యేక హోదా ప్రకటించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం లోక్‌సభలో  బడ్జెట్ పై చర్చ లో పాల్గొన్న భరత్‌ విభజిత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని గుర్తుచేశారు.తిరుపతిలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ఎన్నికల సభలో నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని చెప్పారు.

ఎన్డీఏ ప్రభుత్వం ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినా ఇప్పటికీ ఆ హామీని నిలబెట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.వాగ్దానాలు ఆకాశాన్నిఆవరించిన మేఘంలా కనిపిస్తున్నా.. మేఘం వర్షిస్తేనే వాగ్దానాలు ఫలించినట్టు అని హిందీ కవిత చదివిన మార్గాని భరత్ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించిందని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ సంక్షోభంలో ఉందని, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని,గాయపడిన రాష్ట్రాన్ని ప్రధానమంత్రి ఆదుకోవాలని కోరారు.చంద్రబాబును ప్రజలు పూర్తిగా తిరస్కరించారని అన్నారు.ఏపీ విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయడంతో పాటు రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు తక్షణమే నిధులు విడుదల  చేయాలని కోరారు.13 జిల్లాల్లో 13 భారీ పరిశ్రమలు స్థాపించాలని కోరారు. ఇక ఒలింపిక్స్ లో మన క్రీడాకారులు గోల్డ్ మెడల్ సాధించేందుకు ప్రభుత్వం వద్ద ఏమైనా రోడ్డుమ్యాప్ ఉందా అని భరత్‌ ప్రశ్నించారు.

Thursday, July 4, 2019

నన్ను వెంటాడడమే పని! - బాబు

నన్ను వెంటాడడమే పని!
05-07-2019 03:43:18


అదే జగన్‌ ధ్యేయం.. టీడీపీ నేతలపై కక్ష సాధింపులు
గుంటూరు ఆఫీసుకూ నోటీసులిచ్చే యత్నం
చేతగాక ప్రతిదీ మాకు అంటకడతారా?
చెప్పిందల్లా నమ్మడానికి ప్రజలు అమాయకులు కాదు
ఐదేళ్లలో విత్తన సమస్య రాలేదు.. మళ్లీ విద్యుత్‌ కోతలు
ప్రజావేదిక కూల్చివేతతో వైసీపీ పతనం.. బాబు ఆగ్రహం
గుంటూరు/ఒంగోలు/అమరావతి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): తనను వెంటాడడమే ధ్యేయంగా సీఎం జగన్‌ వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తమ పార్టీ నేతలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. పాలన చేతగాక ప్రతి సమస్యను గత ప్రభుత్వానికి అంటగట్టాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజావేదిక కూల్చివేతతోనే వైసీపీ పతనం ప్రారంభమైందని.. ఇప్పుడు గుంటూరు టీడీపీ కార్యాలయానికి నోటీసులు ఇవ్వాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. గురువారం గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సీనియర్‌ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

టీడీపీ కేడర్‌ను టార్గెట్‌ చేయడమే పనిగా పెట్టుకున్నారని.. ప్రశాంతంగా ఉండే కుప్పంలో కూడా బ్యానర్లపై రగడ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ నేతలు ఏది చెబితే అది నమ్మడానికి ప్రజలు అమాయకులు కాదన్నారు. తమ హయాంలో ఒక్కసారి కూడా విత్తనాలు, ఎరువుల సమస్యల లేకుండా చూశామన్నారు. రైతులు రోడ్డెక్కడానికి టీడీపీ ప్రభుత్వమే కారణమని మంత్రులు, వైసీపీ నాయకులు అనడం విడ్డూరంగా ఉందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో విద్యుత్‌ కోతలు లేకుండా చేశామని.. వైసీపీ వచ్చిన నెల రోజుల్లో కరెంటు కోతలు పునఃప్రారంభమయ్యాయని విమర్శించారు. సమస్యల్లో ఉన్న రైతులకు సంఘీభావం తెలిపాలని నిర్ణయించామని.. రైతుల సమస్యలపై మాజీ మంత్రి సోమిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ తరఫున ప్రత్యేక కమిటీని నియమించినట్లు చంద్రబాబు తెలిపారు. విత్తనాల కొరత, విద్యుత్‌, సాగునీటి కొరత, కరువు పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో కమిటీ పర్యటిస్తుందన్నారు. రైతు సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు.

నేడు రుద్రమాంబపురానికి బాబు
దాడులకు గురైన కార్యకర్తలకు నేతలు అండగా ఉండాలని చంద్రబాబు పిలుపిచ్చారు. శుక్రవారం ప్రకాశం జిల్లాకు, 9న అనంతపురం వెళ్లి దాడులకు గురైన కార్యకర్తలను పరామర్శిస్తానన్నారు. గతనెల 25న ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం చినగంజాం మండలం రుద్రమాంబపురంలో వైసీపీ వర్గీయుల దాడితో మనస్తాపంచెంది టీడీపీ క్రియాశీల కార్యకర్త బసంగారి పద్మ ఆత్మహత్య చేసుకుంది. ఆ కుటుంబాన్ని పరామర్శించి జిల్లాలో టీడీపీ కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు ఆయన జిల్లాకు వస్తున్నారు. ఆయన రాక నేపథ్యంలో టీడీపీ చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం గురువారం రుద్రమాంబపురం సందర్శించి స్థానిక టీడీపీ కార్యకర్తలతో మాట్లాడారు.

ఒకే విషయాన్ని చాలాసార్లు ప్రస్తావించిన చంద్రబాబు (చిత్తూరు కుప్పం పర్యటనలో)

ఒకే విషయాన్ని చాలాసార్లు ప్రస్తావించిన చంద్రబాబు (చిత్తూరు కుప్పం పర్యటనలో)
7/4/2019 9:53:06 AM

- ‘స్థానిక’ సమర సన్నాహం!
- దాడులకు తెగబడే ప్రతిపక్షానికి హెచ్చరికలు
- భిన్న రీతిలో సాగిన చంద్రబాబు పర్యటన
కుప్పం, జూలై 3: మాజీ ముఖ్యమంత్రి, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు రెండురోజుల కుప్పం పర్యటన పలు విశేషాలతో సాగింది. రాష్ట్రంలో కొనసాగుతున్న దాడుల నేపథ్యంలో ఒకవైపు కార్యకర్తలకు భరోసా కల్పిస్తూనే, మరోవైపు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తానంటూ ప్రజలకు నమ్మకం కలిగించడానికి ప్రయత్నించారు. ఓటమితో కుంగిపోయి, ఇక్కడే ఆగిపోరాదని, పోరాడుతూ పోతే.. భవిష్యత్తు మనదేనని భరోసా కల్పించారు. ఓటమి షాక్‌నుంచి కోలుకోలేక, ఘోరమైన ఓటమిని జీర్ణించుకోలేక వలవలా ఏడ్చేసిన పార్టీ వీరాభిమానులను భుజం తట్టి ఓదార్చారు.

తన సహజశైలికి భిన్నంగా, ఏమాత్రం ఆవేశం లేకుండా ఎక్కడ ఏది ఎంతదాకా మాట్లాడాలో అంతదాకానే మాట్లాడుతూ ముందుకు సాగారు. కేవలం నాలుగంటే నాలుగే సమావేశాలు.. అది కూడా రెండు బహిరంగ సభలు, మరో రెండు కార్యకర్తల మీటింగులు పెట్టి వారినీ, వీరినీ పలకరించి తనను కుప్పం నుంచి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నాయకుల వ్యవహారశైలిపై ఫిర్యాదులు చేయబోయిన కార్యకర్తలను సమాధానపరిచి ప్రతిపక్షంలో ఉన్నపుడు నిందలు వేసుకుంటూ పోతే పనికాదని, అందరం కలిసి పార్టీ పటిష్ఠానికి కృషి చేస్తేనే ఎవ్వరికైనా మనుగడ ఉంటుందని ఉద్బోధించారు. మొత్తంమీద త్వరలోనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమరంవైపుగా సమాయత్తం చేశారు చంద్రబాబు.

ఎన్నికలు ముగిసిన తర్వాత కుప్పం నుంచే ప్రజా క్షేత్రంలోకి అడుగు పెట్టిన చంద్రబాబు కుప్పం సమస్యలతో మొదలు పెట్టి దేశ, రాష్ట్ర పరిణామాలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులు ,తానందించిన సుపరిపాలన వంటి అంశాలనన్నింటినీ తన ప్రసంగాల్లో స్పృశించారు. పార్టీని బలోపేతం చేసుకోకుంటే మనుగడ లేదని, ప్రజలకు సైతం సుపరిపాలన అందించే మనసు, నీతి నిజాయితీలు తనకున్నాయని నమ్మబలికారు. ఎప్పుడూ ఎక్కడా తాను తప్పు చేయలేదని, కమిటీలు, ప్రజావేదిక, ఇళ్ల కూల్చివేతల వంటి వేధింపులు ఏమీ చేయలేవని దీటుగా చాటారు. ఇకమీదట ప్రజల్లోనే ఉంటానంటూ సొంత నియోజకవర్గమైన కుప్పం నుంచి ప్రకటించడం ద్వారా తాను ఎవరికీ భయపడేది లేదని, పార్టీ శ్రేణులు కూడా ధైర్యంగా ముందుకు సాగాలన్న సందేశాన్నిచ్చారు.

ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఇంకా సమయముందంటూనే కార్యకర్తలపై దారుణమైన దాడులు జరుగుతుండడం, ఆరుగురు కార్యకర్తలను చంపేయడం వంటి అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఎక్కడా పోరాటమనే మాట వాడకున్నా ప్రజల్లో చైతన్యం తేవడం ద్వారా అనుకున్న కార్యాన్ని వారే సాధించేలా ప్రజల్లోకి దూసుకుపోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆటు ప్రజలకు, ఇటు కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఎక్కడికైనా వచ్చి వారికి అండగా నిలబడతానంటూ ధైర్యం నూరిపోయడానికి ప్రయత్నించారు.

కుప్పంలో చంద్రబాబుకు 1989 తర్వాత మొన్న జరిగిన ఎన్నికల్లోనే అతి తక్కువ మెజారిటీ వచ్చింది. ఈ అంశాన్ని తన ప్రసంగాల్లో చాలాసార్లు ప్రస్తావించిన ఆయన.. ఇటు ప్రజలపైన, అటు స్థానిక నాయకులపైన నిష్టూరపోయారు. అయితే ఎప్పటిలా.. దానికి కారకులంటూ ఎవరిపైనా నిందలు వేయలేదు. జరగాల్సింది జరిగిపోయిందన్నారు. రాష్ట్రంలోనే ఘోర ఓటమి చెందాల్సి వచ్చిందంటూ, ఇప్పుడు నిందలు వేయడానికి రాలేదని, ఎవరికివారే ఎక్క డ తప్పు జరిగిందో తెలుసుకుని సరిదిద్దుకోవాలని హితవు పలికారు.

ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత అధైర్యపడిపోయిన పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చిన చంద్రబాబు, త్వరలోనే జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు వారిని సమాయత్తపరిచారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు గెలుపు గుర్రాలను రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబెట్టి గ్రామస్థాయిలో గట్టి పునాది వేసుకోవాలన్నారు. అందుకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలన్నారు.

సెప్టెంబర్‌ 5 నుంచి.. ఇసుక కొత్త పాలసీ

సెప్టెంబర్‌ 5 నుంచి.. ఇసుక కొత్త పాలసీ
Jul 05, 2019, 04:16 IST
 AP Government Introduces New Sand Policy from 5th September - Sakshi
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇసుక నూతన విధానంపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ప్రజలకు భారం తగ్గింపు, సర్కారుకు ఆదాయం పెంపే లక్ష్యం

మంత్రులు, ఉన్నతాధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం

ఏపీఎండీసీకి సరఫరా బాధ్యతలు

వాహనాలకు జీపీఎస్‌తో అక్రమ రవాణాకు అడ్డుకట్ట

క్వారీల్లో సీసీ కెమెరాలతో నిఘా

క్వారీలు, స్టాక్‌ యార్డుల్లో వేయింగ్‌ మిషన్లు

ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే ఇంటికి చేరనున్న ఇసుక

కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకూ సరఫరా బాధ్యత జిల్లా కలెక్టర్లదే

ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై ఉక్కు పాదం

సాక్షి, అమరావతి: ప్రజలకు ప్రస్తుతం లభిస్తున్న దానికంటే తక్కువ ధరకే ఇసుకను అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రజలకు తక్కువ ధరకే ఇసుక లభించేలా, సర్కారుకు ఆదాయం వచ్చేలా కొత్త విధానం ఉండాలని మార్గనిర్దేశం చేశారు. సెప్టెంబర్‌ 5వ తేదీ నుంచి కొత్త విధానం అమల్లోకి తేవాలని సూచించారు. ప్రజలపై భారం తగ్గింపు, పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వ రాబడి పెంపు, పారదర్శకత, అక్రమ రవాణాకు అడ్డుకట్ట లక్ష్యాలుగా ఇసుక కొత్త విధానం రూపొందించాలని చెప్పారు. అప్పటి వరకు ప్రజలకు ఇబ్బంది లేకుండా కలెక్టర్ల నేతృత్వంలో ఇసుక సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఎక్కడా ఎలాంటి లోపాలకు అవకాశం లేకుండా ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా ప్రజలకు తక్కువ ధరకే ఇసుక సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇసుక మాఫియాకు వరంగా మారిన గత ప్రభుత్వ ఇసుక విధానాన్ని రద్దు చేసిన నేపథ్యంలో కొత్త విధానం ఎలా ఉండాలనే అంశంపై మంత్రులు, ఉన్నతాధికారులతో గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. తెలంగాణాతోపాటు వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఇసుక విధానాల గురించి అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ప్రజలకు, ప్రభుత్వానికి పరస్పర ప్రయోజనకరంగా ఉండేలా మన పాలసీ ఉండాలని సీఎం నొక్కి చెప్పారు. పర్యావరణానికి ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరుగకుండా చూడాలని సూచించారు.

ప్రతి వాహనానికీ జీపీఎస్‌
‘ఇసుకను తరలించే ప్రతి వాహనానికి తప్పనిసరిగా జీపీఎస్‌ పరికరాలు అమర్చాలి. దీనివల్ల వాహనం ఎక్కడి నుంచి ఎక్కడకు ఇసుకను తరలించిందో స్పష్టంగా తెలిసిపోతుంది. ఎక్కడా అక్రమాలకు అవకాశం ఉండదు. ఇసుక అక్రమ తవ్వకాలకు, రవాణాకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ప్రస్తుతం ప్రజలకు ఎంత ధరతో ఇసుక అందుతుందో కచ్చితంగా అంతకంటే తక్కువ రేటుకే అందించాలి. ప్రభుత్వం సరఫరా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేటు పెరిగిందనే మాట ఎక్కడా ప్రజల నుంచి వినిపించకూడదు. అటు వినియోగదారులకు తక్కువ ధరకు అందేలా, ఇటు ప్రభుత్వ ఖజానాకు రాబడి వచ్చేలా కొత్త విధానం సమగ్రంగా పకడ్బందీగా ఉండాలి’ అని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు.


ఏర్పాట్లకు రెండు నెలల సమయం
ఎన్ని రోజుల్లో ఇసుక కొత్తవిధానం అమల్లోకి తేగలరని సీఎం అడిగిన ప్రశ్నకు క్వారీల వద్ద సీసీ కెమెరాలు, స్టాక్‌ యార్డులు, వేయింగ్‌ బ్రిడ్జిలు, వాహనాల గుర్తింపు, రిజిస్ట్రేషన్, జీపీఎస్‌.. తదితరాల ఏర్పాటుకు రెండు నెలలు పడుతుందని అధికారులు తెలిపారు. అందుకు సమ్మతించిన ముఖ్యమంత్రి సెప్టెంబరు 5వ తేదీ నుంచి కొత్త విధానం అమల్లోకి తేవాలని, ఆ లోగా అన్నీ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఇసుక కావాల్సిన వారు ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవడానికి వీలుగా ఒక యాప్, వెబ్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తేవాలని సూచించారు. డిమాండ్‌కు తగిన విధంగా ఇసుకను అందుబాటులో ఉంచి బుక్‌ చేసుకున్న వారికి సకాలంలో అందించేలా ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లు చేసుకోవాలని నొక్కి చెప్పారు. ఇసుక సరఫరాకు కొత్త పాలసీ అమల్లోకి తెచ్చే వరకూ ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేని విధంగా ఇసుకను అందించే బాధ్యత జిల్లా కలెక్టర్లు యథాతథంగా చూసుకోవాలని ఆదేశించారు. ఇసుక డిమాండు – ఉత్పత్తి మధ్య అంతరం తగ్గించేందుకు రోబో శాండ్‌ను ప్రోత్సహించాలని సూచించారు.

సిలికా అక్రమ తవ్వకాలకు చెక్‌
నెల్లూరు జిల్లాలో సిలికా ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్న అంశం ఈ సందర్భంగా ప్రస్తావనకు రాగానే సీఎం సీరియస్‌గా స్పందించారు. ఇసుకను అక్రమంగా తవ్వి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. సంబంధిత అధికారులంతా సమావేశమై అక్రమ తవ్వకాల నిరోధానికి గట్టి చర్యలు తీసుకోవాలని, అక్రమ తవ్వకాల మాట ఇక తనకు వినిపించరాదని ఆదేశించారు. గత అయిదేళ్లలో కోట్ల రూపాయల విలువైన ఇసుక కుంభకోణం సాగిందని సీఎం గుర్తు చేశారు. ఇసుక కొనుగోలు ప్రజలకు భారంగా మారగా, మాఫియా కాసుల మూటలు కొల్లగొట్టిందని, సర్కారుకు మాత్రం ఆదాయం లేకుండా పోయిందన్నారు. ఇలాంటి వ్యవహరాలను ఇలాగే వదిలేస్తే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేకుండా పోతుందన్నారు. ఈ అక్రమాలకు చెక్‌ పెట్టి ప్రజలకు, ప్రభుత్వానికి ఉభయతారకంగా మార్చడం కోసమే కొత్త ఇసుక పాలసీ తెస్తున్నామని చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, మేకతోటి సుచరిత, అనిల్‌ కుమార్‌ యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయకల్లం, భూగర్భ గనుల శాఖ కార్యదర్శి శ్రీనివాస్‌ శ్రీనరేష్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఏపీఎండీసీకే సరఫరా బాధ్యతలు
ఇసుక కొత్త విధానం మేరకు సరఫరా బాధ్యతలను ఏపీఎండీసీకి అప్పగిద్దామని అధికారులు చేసిన సూచనకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీని ప్రకారం ఏపీఎండీసీనే ప్రజలకు ఇసుకను విక్రయించనుంది. కొత్త విధానం అంతిమంగా ప్రజలకు ఇబ్బంది కలగని విధంగా, పర్యావరణానికి నష్టం కలుగని రీతిలో, పూర్తి పారదర్శకంగా ఉండాలని సీఎం సూచించారు. ఇసుక కొత్త విధానం ఇలా అమలు కానుంది.
► జిల్లాల్లో ఇసుక రేవులను గనుల శాఖ గుర్తిస్తుంది. వీటికి సమీపంలో ఏపీఎండీసీ నిల్వ కేంద్రాలు (స్టాక్‌ పాయింట్లు) ఏర్పాటు చేసుకుంటుంది.
► క్వారీల నుంచి ఇసుకను తవ్వించి వాహనాల్లో స్టాక్‌ పాయింట్లకు ఏపీఎండీసీనే చేరవేస్తుంది.
► క్వారీ వద్దకు రాగానే ఖాళీ వాహనం బరువును వేయింగ్‌ మిషన్‌ ద్వారా లెక్కిస్తారు. దాంట్లో ఇసుక నింపిన తర్వాత మళ్లీ బరువు చూస్తారు. దీంతో వాహనంలో ఎన్ని టన్నుల ఇసుక ఉందో తేలిపోతుంది. వాహనంలో ఎంత ఇసుక ఉందో డ్రైవరుకు చీటీ ఇచ్చి పంపుతారు. స్టాక్‌ యార్డులోని సిబ్బంది ఆ చీటీ తీసుకుని మళ్లీ తూకం వేసి అంతే పరిమాణంలో ఇసుక ఉందని నిర్ధారించుకున్న తర్వాతే అన్‌ లోడ్‌ చేయిస్తారు.
► వినియోగదారులకు ఇసుక పంపేప్పుడు కూడా వాహనాలను తూకం వేసి కచ్చితంగా వారు కోరిన పరిమాణంలో పంపించే ఏర్పాటు చేస్తారు. దీనివల్ల క్వారీలో ఎన్ని టన్నుల ఇసుక తవ్వారు? స్టాక్‌ యార్డులకు ఎంత చేరింది? ఎంత విక్రయించారు? అనే లెక్క కచ్చితంగా ఉంటుంది. ఎక్కడా ఇసుక పక్కదారి పట్టడానికి  అవకాశం ఉండదు.
► ప్రజలకు ఇబ్బంది లేకుండా నగరాలు, పట్టణాల్లో అదనపు స్టాక్‌ యార్డులు ఏర్పాటు చేస్తారు.
► ఇసుక కావాల్సిన వారు వెబ్‌ పోర్టల్‌ ద్వారా ఇంటి నుంచే బుక్‌ చేసుకుని డబ్బు చెల్లిస్తే ఏపీఎండీసీనే ఇంటికి వాహనాల ద్వారా ఇసుకను చేరవేస్తుంది. ఏపీఎండీసీ వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకుని జీపీఎస్‌ పరికరాలు అమర్చుకున్న వాహనాలను సంస్థ స్టాక్‌ యార్డుల వద్దకు అనుమతిస్తారు. ఎవరు ముందు బుక్‌ చేసుకుంటే వారికి ముందుగా పద్ధతిలో ఇసుకను పంపిస్తారు.

ఇసుక వ్యాపార వస్తువు కాకూడదు : మంత్రి పెద్దిరెడ్డి
సహజ సిద్ధమైన ఇసుకను వ్యాపార వస్తువుగా మార్చరాదనేది ప్రభుత్వ లక్ష్యమని భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇసుక ద్వారా ఆదాయం మాఫియాకు వెళ్లరాదని, ప్రజలకు సరసమైన ధరలకు అందించడం ద్వారా ఆదాయం ప్రభుత్వానికే రావాలన్నారు. గురువారం సాయంత్రం ఇసుక పాలసీపై ముఖ్యమంత్రి సమీక్ష అనంతరం ఆయన  మీడియాతో మాట్లాడారు. ఇసుక కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇసుక అందేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటారని చెప్పారు.

ప్రభుత్వం ఇసుక సరఫరా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేటు పెరిగిందనే మాట ఎక్కడా ప్రజల నుంచి వినిపించకూడదు. అటు వినియోగదారులకు తక్కువ ధరకు అందేలా, ఇటు ప్రభుత్వ ఖజానాకు రాబడి వచ్చేలా కొత్త విధానం సమగ్రంగా పకడ్బందీగా ఉండాలి.