Tuesday, March 15, 2022

తృతీయ శక్తి అవుదాం!

 తృతీయ శక్తి అవుదాం!


‘సీఎంగా బీసీ’ ప్రతిపాదనకు నా మద్దతు: బ్రదర్‌ అనిల్‌

విశాఖలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రైస్తవ, 

మైనారిటీ సంఘాలతో సుదీర్ఘ సమావేశం

మరోసారి సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ

ఏపీలో షర్మిల పార్టీని విస్తరించాలని కోరుతున్నారు

గెలిపించిన వారిని జగన్‌ పట్టించుకోవట్లేదు

రెండున్నరేళ్లుగా ఆయన్ని కలవలేదు 

వివేకా కుటుంబానికి న్యాయం జరుగుతుంది: అనిల్‌ 


విశాఖపట్నం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు న్యాయం చేసేందుకు రాజకీయంగా మూడో ప్రత్యామ్నాయ శక్తిగా తయారవుదామని బ్రదర్‌ అనిల్‌కుమార్‌ పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. సోమవారం విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో ఉత్తరాంధ్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాల నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ‘‘ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగడం లేదు. మీరు ముందుకువచ్చి పార్టీ స్థాపిస్తే మేమంతా వెనకుండి నడిపిస్తాం’’ అని సమావేశంలో అన్ని సంఘాల నేతలు బ్రదర్‌ అనిల్‌కుమార్‌ను కోరినట్టు తెలిసింది. ‘‘మీరంతా సంఘటితంగా కలిసి వస్తామంటే.. ముందుండి నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నా’’ అని అనిల్‌ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత లోతుగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు త్వరలోమరోసారి సమావేశమవుదామని చెప్పినట్టు సమాచారం.


బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలకు బదులుగా బలహీన వర్గాల నాయకత్వంలో ప్రత్యామ్నాయం అవసరమని వివరించినట్టు సమాచారం. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకూ ఈ సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన సుమారు 70 మంది ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఒక్కో ప్రతినిధి ఐదు నుంచి పది నిమిషాల పాటు సమస్యలు ఏకరవు పెట్టినట్టు సమాచారం. అనంతరం బ్రదర్‌ అనిల్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్‌ షర్మిల.. ఆంధ్రప్రదేశ్‌కు కూడా పార్టీని విస్తరించాలని పలువురు కోరుతున్నారని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడానికి సహకరించాలని ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు కోరారని వెల్లడించారు. వారి ప్రతిపాదనను కచ్చితంగా సమర్థించి, మద్దతు ఇస్తానని ప్రకటించారు. గత ఎన్నికల్లో తాను ఇచ్చిన పిలుపునకు స్పందించి ఎంతో మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రైస్తవ, ముస్లిం మైనారిటీ సంఘాల నాయకులు వైసీపీ విజయానికి కృషి చేశారని చెప్పారు. సీఎం జగన్‌ కానీ, ప్రభుత్వం కానీ ఈ వర్గాల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. దీంతో వారంతా పిలిచి తమ సమస్యలు, ఇబ్బందులు తనకు వివరించారని చెప్పారు. ‘‘ప్రభుత్వం నుంచి ఆయా వర్గాలు ఏం ఆశించారో, ఏం కోల్పోయారో వివరించారు. వారి బాధలు వినేవారు కానీ, సమాధానం చెప్పేవారు కానీ లేరు. దీంతో బాధ్యత తీసుకోవాలని నిర్ణయించాను’’ అని అన్నారు. 


జగన్‌ బిజీగా ఉన్నట్టున్నారుఇటీవల విజయవాడలో ఇదే తరహాలో నిర్వహించిన సమావేశంలో ఆయా సంఘాలు వెలిబుచ్చిన సమస్యలు, అభిప్రాయాలను సీఎం జగన్‌కు వివరించారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ‘‘ఆయన (జగన్‌) పథకాల అమలు బిజీలో ఉన్నట్టున్నారు. నేను నా పనుల్లో తీరిక లేకుండా ఉన్నాను. నేను ఆయన్ను కలిసి రెండున్నరేళ్లు అయ్యింది’’ అని బ్రదర్‌ అనిల్‌ సమాధానమిచ్చారు. జగన్‌కు ఇప్పుడైనా వివరించేందుకు ప్రయత్నిస్తారా అన్న ప్రశ్నకు.. లేఖ ద్వారా లేదా వ్యక్తిగతంగా కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. హామీలను నెరవేర్చకుండా వైసీపీ సర్కారు కక్షసాధింపుతో పరిపాలన చేసే పరిస్థితి కనిపిస్తోందని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. వైఎస్‌ కుటుంబంలో విభేదాలు ఉన్నాయా? అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేశారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో బాధిత కుటుంబానికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని బ్రదర్‌ అనిల్‌ అన్నారు. కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందని, అది చిన్న వ్యవస్థ కాదని వ్యాఖ్యానించారు. 


అనిల్‌ పిలుపుతో వైసీపీకి ఓట్లు: హనోక్‌గత ఎన్నికల్లో బ్రదర్‌ అనిల్‌కుమార్‌ ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారానికి రాకపోయినా ఫోన్‌లు చేసి, సమావేశాలు ఏర్పాటు చేసి జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారని ఈ సమావేశంలో ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రిస్టియన్‌ చారిటీ (ఏఐసీసీ) జాతీయ అధ్యక్షుడు గారా హనోక్‌ వెల్లడించారు. ఆయన పిలుపు మేరకు తామంతా వైసీపీ విజయానికి కృషి చేశామన్నారు. టీడీపీకి ఓటేద్దామనుకున్నవారు కూడా ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేశారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత అందరికీ అన్యాయం చేస్తున్నారని జగన్‌ను ఉద్దేశించి అన్నారు. 


సర్కారు పట్టించుకోవడం లేదు!: సంఘాలుసమావేశంలో పాల్గొన్న నేతలు తమ సమస్యలు, కష్టాలను బ్రదర్‌ అనిల్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఈ సందర్భంగా పార్టీ ఏర్పాటు చేయాలని కోరినట్టు సమా చారం. క్రైస్తవుల అండదండలతో అధికారం దక్కించుకున్న జగన్‌.. వారి యోగక్షేమాలను పట్టించుకోవడం లేదని క్రైస్తవ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్టియన్‌ మిషనరీల ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిడెడ్‌ పాఠశాలలు, చర్చిలు, హాస్టళ్లను ప్రభుత్వం లాక్కొంటోందని పలువురు బిష్‌పలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీల రాయితీలను కూడా వైసీపీ సర్కారు నిలిపివేసిందని కొందరు విమర్శించారు. సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!

Monday, March 14, 2022

ఒక్కటై ఓడిస్తాం! - పవన్ కళ్ాణ్

 ar 15 2022 @ 02:59AM 

ఒక్కటై ఓడిస్తాం! - పవన్ కళ్ాణ్ 


వైసీపీ వ్యతిరేక శక్తులు ఏకమవ్వాలి..

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను

బీజేపీ రోడ్‌మ్యాప్‌ కోసం వెయిటింగ్‌

2024లో ప్రజా ప్రభుత్వం స్థాపిస్తాం

మేం వస్తే ‘అప్పుల్లేని ఆంధ్రప్రదేశ్‌’

ముమ్మాటికీ అమరావతే రాజధాని

అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం

సీపీఎస్‌ రద్దు.. మళ్లీ పాత పెన్షన్‌

ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం

జనసేనాని కార్యాచరణ ప్రకటన

వైసీపీ సర్కారుది విధ్వంసకర పాలన

కూల్చివేతలు... అశుభంతో ప్రారంభం

పెట్టుబడులు లేవు.. ఉన్నవీ పోతున్నాయి

ఇసుకను కరకరా నమిలేస్తున్నారు

భవన కార్మికుల ఉసురు తీశారు

నిషేధం అంటూనే మద్యం నుంచి సొమ్ములు

‘ఒక్క చాన్స్‌’తో రాష్ట్రం పాతికేళ్లు వెనక్కి

మళ్లీ వస్తే పిల్లల చేతిలో చాక్లెట్లూ లాగేస్తారు!


(అమరావతి-ఆంధ్రజ్యోతి)2024లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా... వైసీపీ వ్యతిరేక ఓటును చీలకుండా చూస్తామని ప్రకటించారు. ‘‘ఎమర్జెన్సీ సమయంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నీ కలిశాయి. ఇప్పుడూ అలాగే వైసీపీ వ్యతిరేక శక్తులు కలవాలి. ఆంధ్రప్రదేశ్‌ బాగు కోసం చెబుతున్నా... వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదు’’ అని పవన్‌ ఉద్ఘాటించారు. పార్టీలు, వ్యక్తిగత లాభాలు వదిలి రాష్ట్ర ప్రయోజనాలకు రావాలని... అప్పుడు పొత్తుల కోసం ఆలోచిస్తామని ప్రకటించారు. రాష్ట్ర బాధ్యతను జనసేన తీసుకుంటుందన్నారు. ఈ దిశగా బీజేపీ  నాయకులు రోడ్‌మ్యాప్‌ ఇస్తామని చెప్పారని, దానికోసం ఎదురు చూస్తానని తెలిపారు. రోడ్‌ మ్యాప్‌ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని, వైసీపీని గద్దె దించుతామని ఆయన స్పష్టం చేశారు. సోమవారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జరిగిన జనసేన 9వ ఆవిర్భావ సభలో పవన్‌ కల్యాణ్‌ ప్రసంగించారు. వైసీపీపై నిప్పులు చెరిగారు. భావి పొత్తులపై సంకేతాలు ఇచ్చారు. ‘‘ఇన్ని సంవత్సరాలు ప్రజలకు అండగాఉండి భుజంకాచాను. ఇప్పుడు నేను సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నా. రాష్ట్ర బాధ్యతను  జనసేన తీసుకుంటుంది’’ అని పవన్‌ తన కార్యాచరణను విస్పష్టంగా ప్రకటించారు. 2019 ఎన్నికల్లో 137 సీట్లలో పోటీచేస్తే 7.24 శాతం ఓట్లు వచ్చాయని చెప్పారు.

ఒక ఎమ్మెల్యే సీటు నెగ్గినప్పటికీ... వైసీపీ లాక్కెళ్లిందని మండిపడ్డారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయాలను వివరించారు. పార్టీ సభ్యత్వం 46 లక్షలకు చేరుకుందని పవన్‌ ప్రకటించారు. ‘‘ఎంత సింధువైనా బిందువుతోనే మొదలవుతుంది. ఏడు శాతం నుంచి 27 శాతానికి, ఆ 27 నుంచి  ప్రభుత్వాన్ని స్థాపించే స్థానానికి ఎదగబోతున్నాం’’ అని తెలిపారు. ‘‘రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్‌ బాగుండాలి. ఈ రాష్ట్రం చీకట్లోకి వెళ్లకుండా చూడటం జనసైనికుల చేతుల్లోనే ఉంది. నేను నడిచి చూపిస్తాను. మీరు నడవండి.  ఇప్పుడు... వైసీపీ చీకటి పాలనను అంతమొందించే అవకాశం లభించింది. ఇలాంటి సామాజిక ప్రగతి నిర్మాణం చేసే అవకాశాలు అరుదుగా వస్తాయి. వాటిని సద్వినియోగంచేసుకోవాలి’’ అని పిలుపునిచ్చారు.   ‘‘2014లో సూటిగా ప్రశ్నించాం. ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నాం. 2019లో బలంగా పోరాటం చేశాం. బరిలో నిలబడి ఉన్నాం. 2024లో గట్టిగా నిలదొక్కుకుంటాం. ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాం’’ అని ఉద్ఘాటించారు.

ఈ పాలన విధ్వంసంతో మొదలు... ‘‘కొత్త ఇంట్లోకి వెళ్తే శుభంతో మొదలుపెడుతాం. మీ ప్రభుత్వం అశుభంతో... కూల్చివేతలతో ప్రారంభించింది.  మూడు నెలలకే ఇసుక సమస్య వచ్చింది. 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డుమీద పడ్డారు. 32 మంది ప్రాణాలను మీ నాయకత్వం బలిగొంది.ఆ రోజు నుంచి ఇప్పుడు జనసేన సభకు ఆటంకం కలిగించే వరకు విధ్వంసాలే! ఇంత నెగటివ్‌ మనుషులా!’’ అని పవన్‌ ఈసడించారు. తన ప్రసంగాన్ని జై ఆంధ్రప్రదేశ్‌, జై తెలంగాణ, జై భారత్‌ అంటూ మొదలుపెట్టారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది ప్రముఖులు, అన్ని పార్టీల నేతలకు పేరుపేరునా నమస్కరించారు. అన్ని మతాలను ప్రస్తావిస్తూ వాటి గొప్పతనాన్ని వివరించారు. 

ఒక కులాన్ని వర్గశత్రువుగా రాష్ట్రంలో ఒక కులాన్ని వైసీపీ వర్గశత్రువుగా ఎలా ప్రకటించింది? దీని వల్ల రాష్ట్రం అస్తవ్యస్తమవుతోంది. వైశ్య సామాజికవర్గాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇబ్బందులుపెడుతున్నారు. వారికి జనసేన అండగా ఉంటుంది. యానాది, రెల్లి, ముత్తరాసి, బీసీ. సంచారజాతులు ఎస్సీలు, గిరిజనులకు అండగా ఉంటాం. 

ద్వారంపూడికి భీమ్లానాయక్‌ ‘ట్రీట్‌మెంట్‌’ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి అనే వ్యక్తి నన్ను అకారణంగా పచ్చిబూతులు తిట్టారు. అది వైసీపీకి  అలవాటే. నేను భరించాను. కానీ... నన్ను తిడితే మా జనసైనికులు, వీర మహిళలకు కోపం వస్తుంది. గతంలో ఆయన  (ద్వారంపూడి)  కుటుంబానికి  ఎస్పీ డీటీ నాయక్‌ ట్రీట్‌మెంట్‌ జరిగింది. భవిష్యత్‌లో ఇలాగే చేస్తే... ‘భీమ్లా నాయక్‌ ట్రీట్‌మెంట్‌’ అంటే ఏమిటో చూపిస్తాను. 

అమరావతే రాజధానిఎట్టి పరిస్థితుల్లో అమరావతే రాజధానిగా కొనసాగుతుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారవు. ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా పాలసీలు మారవు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి మద్దతు తెలిపి వారి విజయానికి మనవంతు సహకారం అందించాం. రాజధాని విషయంలో ఇక్కడ పెనుమాక, ఉండవల్లి, మిగతా గ్రామాల రైతులు భూములు ఇవ్వడం ఇష్టం లేదంటే మేం వారి పక్కన నిలబడ్డాం. మేం మద్దతు ఇచ్చిన ప్రభుత్వంపై మేం గొంతెత్తినప్పుడు, వైసీపీ నాయకత్వం ఆ రోజు ఏం చేసింది? ఆనాడు గాడిదలు కాస్తున్నారా? మూడు రాజధానులు అని ఆ రోజు ఎందుకు చెప్పలేదు? 29 గ్రామాలు... 26,896 మంది రైతులు, 34వేల ఎకరాలు దీంట్లో 32 శాతం మంది ఎస్సీలు, మిగతా వారు బీసీలు, ఇతరులున్నారు.  ఆషామాషీగా ఉందా మీకు? మీ ఇష్టానికి రాజధాని మార్చేస్తారా? అమరావతి రైతులకు చెబుతున్నా! ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి. ఎక్కడికి వెళ్లదు. మీ మీదపడ్డ ప్రతీ లాఠీదెబ్బ నామీద పడినట్లే. అమరావతి ఇక్కడి నుంచి కదలదు. అలాగని మిగతా ప్రాంతాలను వదిలేస్తామని కాదు. 

ఇదేనా వైసీపీ ప్రతిజ్ఞ... వైసీపీ అధికారంలోకి రాగానే మూడు తప్పులు చేసిందని పవన్‌ పేర్కొన్నారు. అవి...1) గత ప్రభుత్వం చేసిన పనులను రద్దు చేయడం. 2) 2. పీపీఏ (విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు)లను రద్దుచేసింది. 3)  అమరావతి రాజధాని స్థానంలో మూడు రాజధానులని తప్పు మీద తప్పు చేసింది. విధ్వంసమే వైసీపీ విధానమని... ప్రతిజ్ఞ చేసినట్లుగా దారుణాలకు తెగబడుతున్నారని పవన్‌ అన్నారు. బహుశా... వైసీపీ ప్రతిజ్ఞ ఇదే కావొచ్చు అంటూ ఆ పాఠాన్ని చదివి వినిపించారు. అదెలా సాగిందంటే... ‘‘ఆంధ్రప్రదేశ్‌ మా సొంత భూమి. ఆంధ్రులందరూ మా బానిసలు. న్యాయవ్యవస్థను లెక్కేచేయం.  పోలీసులను ప్రైవేటు ఆర్మీగా వాడేస్తాం.  రాష్ట్ర రహదారులను గుంతల మయంచేస్తాం. ప్రజల వెన్నుపూసలు విరగొట్టేవరకు విశ్రమించం. పెట్టుబడుల్లో 50 శాతం వాటా లాక్కుంటాం.  అన్నంపెట్టే రైతన్నలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తాం. ఇసుకను అప్పడంలా కరకరా నమిలేస్తాం.  పార్కులు, స్కూళ్లు, ప్రభుత్వ భవనాలను తాకట్టుపెట్టేస్తాం. సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూనే ప్రజలతో చిత్తుగా తాగిస్తాం. మా వైసీపీ ఎంపీ అయినా సరే... ఎదురు తిరిగితే చితక్కొడతాం. ఒక్క చాన్స్‌తో ఆంధ్రాను పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్లాం. ఇంకొక్క చాన్స్‌ ఇస్తే చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు కూడా లాక్కుంటాం!’’

న్యాయవ్యవస్థనూ వదిలిపెట్టలేదువైసీపీ న్యాయ వ్యవస్థను కూడా తప్పుపట్టేదాకా వెళ్లింది.  హైకోర్టు ఒక పార్టీ బ్రాంచ్‌ ఆఫీసుగా మారిందని తిడతారా? ఏ స్థాయికి వీరి గుండాయిజం వెళ్లిందంటే ఇళ్లలోకి వచ్చి రైతులను కొట్టడం, న్యాయ వ్యవస్థ జీవితంలోకి వెళ్లడం వీరి గుండాయిజం. 

పోలీసులూ విసిగిపోయారు...వైసీపీ వల్ల పోలీసు వ్యవస్థ కూడా విసిగిపోయింది. పోలీసులకు జీతభత్యాలు, కనీసం కరువు భత్యం సరిగ్గా ఇవ్వడం లేదు. అధికారంలోకి వస్తే వారాంతపు సెలవు ఇస్తానని చెప్పారు. అది లేకపోగా వీరి నిర్వాకంవల్ల పోలీసులకు పని మరింత పెరిగింది. వైసీపీ వారికి భయం లేదు. సీఐ ర్యాంకు అయినా సరే వారి చొక్కా కాలర్‌ పట్టుకుంటారు. చిత్తూరులో ఒక సీఐని కాలర్‌ పట్టుకున్నారు. ఇంకో సీఐని విశాఖ పీఠంలో చొక్కాలు విప్పికొడతామని మంత్రి ఒకరు బెదిరిస్తారు. కృష్ణలంక స్టేషన్‌లో ఎంపీ కానిస్టేబుల్‌ను కొట్టేశారు. ఓ పోలీసు బిడ్డగా చెబుతున్నా... ఓ తప్పుడు ఎమ్మెల్యే, గుండా మా తండ్రిని కొడితే ఏమిటి ఇది అనిపిస్తుంది కదూ!  అధికారంలోకి రాగానే 14,341 పోలీసు ఉద్యోగాలు భర్తీచేస్తామన్నారు. 400 తప్ప మిగతా ఉద్యోగాలు లేవు. ఈ పాలనలో తొలుత పారిశ్రామికవేత్తలు దెబ్బతిన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే సీపీఎస్‌ రద్దుచేస్తామన్నారు.  అధికారంలోకి  వచ్చాక మొండి చేయి చూపించారు.  మా నాయకుడికి ఆ రోజున విషయ పరిజ్ఞానం లేదని, టెక్నికాలిటీస్‌ తెలియదన్నారు.   

పార్టీ రంగుల కోసం 3వేల కోట్ల ఖర్చు వైసీపీ పార్టీ రంగుల కోసం 3వేల కోట్లు ఖర్చుపెట్టారు. ప్రకటనలకు 400 కోట్లు వృఽథా చేశారు. మీ పార్టీ రంగులు వేసుకోవడానికి 3వేల కోట్లు ఉంటాయి కానీ ఉద్యోగస్తులకు ఇవ్వడానికి  డబ్బులు ఉండవా? 


ఇదీ అప్పులవల్ల అనర్థం... తెలంగాణ ఆదాయం 99,900 కోట్లు. ఆంధ్రా ఆదాయం లక్షా 17వేల కోట్లు. ఈ ఆదాయం ఎటుపోతోంది? ఏం చేస్తున్నారు? తాకట్టులో భారత దేశం అన్నట్లు... ‘అప్పులో ఆంధ్ర’గా మారిపోయింది. దాని ప్రభావమే ప్రజలపై పడుతోంది. ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు? టీచర్‌ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? కొత్త నియామకాలు ఎందుకు చేపట్టడం లేదు? ఉద్యోగుల జీతాలు ఎందుకు పెరగడం లేదు? అమ్మఒడి పథకానికి డబ్బులు ఎందుకు ఆగాయి? ఎయిడెడ్‌ స్కూల్స్‌, కాలేజీలను ఎందుకు మూసివేస్తున్నారు. ఆరోగ్యశ్రీని ఎందుకు మంచం ఎక్కించారు? ిపింఛన్లు ఎందుకు తగ్గించారు? దీనింతటికీ కారణం... అప్పులు చేయడమే!

పెట్టుబడులను చంపేశారు వైసీపీ నేతలు పెట్టుబడులను చంపేశారు. ఏపీ అంటే ఎవ్వరూ రావడం లేదు. ఉన్నవాటిని పంపించేస్తున్నారు. అమర్‌రాజా కంపెనీ ఓఉదాహరణ. అనంతపురం జిల్లాలో కియతో రావాల్సిన అనుబంధ పరిశ్రమలు రాలేదు. 

మద్యం ఆదాయంలో రికార్డుటీడీపీ హయాంలో మద్యంపై 59 వేల కోట్లు ఆదాయం రాగా... వైసీపీ రెండున్నరేళ్లలోనే 45వేల కోట్లు సంపాదించింది. ధరలు పెంచితే మద్యం తాగేయడం మానేస్తారని ఓ దరిద్రపు, నీచ, నికృష్ట వాదన వినిపిస్తారు. నాసిరకం లిక్కర్‌ అమ్ముతున్నారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి 12 మంది మరణించారు. ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌ కాదు.. అది ఇడుపులపాయ ఫారిన్‌ లిక్కర్‌! 25వేల కోట్ల మద్యం ఆదాయం వారి జేబుల్లోకి చేరుకుంది. 


మేం అధికారంలోకి వస్తే..సెక్యులరిజం అంటే ఒక మతానికి ఒక న్యాయం, మరో మతానికి మరో న్యాయం కాదు! మసీదులు, చర్చిలను ప్రభుత్వం కంట్రోల్‌లో పెట్టుకోదు. కానీ హిందూ దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణ ఎందుకు? దీనిని మేం పరిశీలిస్తాం.  టీటీడీ, ఎండోమెంట్‌ చట్ట సవరణను పరిశీలిస్తాం.  ఏపీని అప్పులు లేని రాష్ట్రంగా చేయాలన్నదే నా లక్ష్యం. ఆర్థికాభివృద్ధి సాధించడమే లక్ష్యం. ఇందుకోసం ఇన్వెస్టర్‌ ఫ్రెండ్లీ ప్రభుత్వం తీసుకొస్తాం. విశాఖను విశ్వనగరంగా, విజయవాడ, తిరుపతిని బలమైన హైటెక్‌ నగరాలుగా తీర్చిదిద్దుతాం. అమరావతిని అన్ని వర్గాలు, కులాలకు నివాసం కల్పించే అభ్యుదయ రాజధానిగా ముందుకు తీసుకెళ్తాం. కర్నూలు నగరం రుణం తీర్చుకుంటాం. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెడతాం. రాయలసీమ బిడ్డలను గల్ఫ్‌ నుంచి తీసుకొచ్చి ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పేదల ఇళ్ల నిర్మాణాలకు, తెల్లకార్డుదారులకు ఉచిత ఇసుక ఇస్తాం. జనసేన సౌభాగ్యపదం కింద యువతకు ఒక్కొక్కరికి 10 లక్షల ఆర్ధిక సహాయం చేస్తాం. సంవత్సరానికి లక్ష మంది  చొప్పున ఐదేళ్లలో 5 లక్షల మందికి బ్యాంకులో డబ్బు వేస్తాం. బడుగు, బలహీనవర్గాలకు ప్రాధాన్యం ఇస్తాం. వ్యవసాయరంగాన్ని లాభసాటిగా మారుస్తాం. గిట్టుబాటు రాక రైతులు ఏడుస్తున్నారు. రైతు కన్నీరుపెట్టకూడదు. రైతులతో మాట్లాడుతాం. వారి  కష్టాలను అర్ధం చేసుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాం. మద్దతు ధర, పుడ్‌ప్రాసెస్‌, పంటకాలువలు, మినీ రిజర్వాయర్లను ఆధునీకరిస్తాం. 

ప్రతి ఉద్యోగ ఖాళీ భర్తీచేస్తాం... ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్నీ జనసేన అధికారంలోకి రాగానే భర్తీ చేస్తుంది. నిరుద్యోగుల ప్రయోజనాలను కాపాడుతాం. ప్రైవేటు రంగంలో ఏటా 5 లక్షల ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళిక అమలు చేస్తాం. ఉద్యోగులకు పీఆర్‌సీ సవరణ చేయిస్తాం. ఓ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా సీపీఎ్‌సను రద్దుచేయిస్తాం. పాత పెన్షన్‌ విధానం తీసుకొస్తాం. మీకు అండగా ఉంటాం. 




వైఎస్సార్‌సీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వం

Mar 15, 2022, 03:30 IST

Pawan Kalyan Comments In Janasena Party formation day Meeting - Sakshi

గుంటూరు జిల్లా ఇప్పటంలో జరిగిన సభలో మాట్లాడుతున్న పవన్‌కల్యాణ్‌


ఆ పార్టీని గద్దె దింపడానికి అందర్నీ కలుపుకొనిపోతాం 


బీజేపీ రోడ్‌ మ్యాప్‌ కోసం ఎదురుచూస్తున్నా 


రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తులపై సరైన నిర్ణయం తీసుకుంటాం 


రెండు చోట్ల ఓడిపోయినా వెనక్కి తగ్గలేదు 


2024లో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం 


అప్పుల నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగిస్తాం 


కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు 


అమరావతే ఏకైక రాజధాని 


జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్‌ 


సాక్షి, అమరావతి బ్యూరో: వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వబోమని, ఆ పార్టీని గద్దె దింపడానికి అన్ని పార్టీలను కలుపుకొనిపోతామని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. సోమవారం తాడేపల్లి మండలం ఇప్పటంలో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు. పార్టీలు, వ్యక్తగత ప్రయోజనాలు వదిలి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై పోరాడటానికి రోడ్‌ మ్యాప్‌ని అందజేస్తామని బీజేపీ చెప్పినా, ఇంతవరకు ఇవ్వలేదన్నారు.


2019 ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయినప్పుడు చాలా బాధపడ్డానని, అధికార పార్టీ నాయకులు తనను ఎన్నో సార్లు మానసిక అత్యాచారం చేశారని చెప్పారు. 2019లో ఒక్క సీటే గెలిచినా, స్థానిక సంస్థల్లో పార్టీ మంచి ఫలితాలను సాధించిందన్నారు. 150 మంది సభ్యులతో మొదలైన పార్టీ నేడు 5 లక్షల మంది సభ్యత్వం తీసుకొనే దిశగా సాగుతోందని చెప్పారు. 2024లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. రెండున్నరేళ్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎన్నో బాధలు పడ్డారని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం కూల్చివేతతో పాలన మొదలుపెట్టిందన్నారు. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. రోడ్లు వేయకపోవడం వల్ల ప్రమాదాలు పెరిగాయన్నారు.


అమరావతే ఏకైక రాజధాని

అమరావతిలో టీడీపీ ప్రభుత్వం రాజధాని నిర్మించాలనుకున్నప్పుడు తాను వ్యతిరేకించానని చెప్పారు. గత ప్రభుత్వాలు తప్పులు చేస్తే వాటిని సవరించి, కొనసాగించాలన్నారు. అమరావతే ఏకైక రాజధాని అని స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే పీఆర్‌సీ సవరణ చేస్తామని, సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అప్పుల నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగిస్తామని చెప్పారు. నూతన పారిశ్రామిక విధానం తెస్తామన్నారు. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెడతానన్నారు. రేషన్‌ కార్డు ఉన్న అందరికి ఉచితంగా ఇసుక ఇస్తామన్నారు. పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఐదేళ్లలో ఐదు లక్షల మంది యువతకు సంవత్సరానికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర అందేలా చూస్తామన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. 


మంత్రులపై విమర్శలు

తాను వ్యక్తిగత దూషణలకు వ్యతిరేకమని ఒకవైపు చెబుతూనే మరోవైపు మంత్రులను దూషించారు. మంత్రులు  వెలంపల్లి, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే అంబటి రాంబాబుల పేర్లను వెటకారంగా పలికారు. అధికారంలోకి వచ్చాక ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి భీమ్లానాయక్‌ ట్రీట్‌మెంట్‌ రుచి చూపిస్తానన్నారు. 


పార్టీని ఎన్నో రకాలుగా ఇబ్బందిపెట్టారు : నాదెండ్ల

జనసేన పార్టీ, పవన్‌ కల్యాణ్‌లను ఎన్నో రకాలుగా అధికార పార్టీ ఇబ్బంది పెట్టిందని పార్టీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ వ్యాఖ్యానించారు. పార్టీ కార్యక్రమాలు కార్యకర్తలకు తెలియడానికి అస్త్ర యాప్‌ను సిద్ధం చేశామన్నారు. 


రాష్ట్రం అప్పుల పాలవుతోంది : నాగబాబు

అధికారపార్టీ చర్యలతో రాష్ట్రం అప్పులపాలవుతోందని నాగబాబు విమర్శించారు. ప్రతి వ్యక్తిపై రూ.లక్షకు పైగా అప్పు ఉందన్నారు.