Saturday, May 29, 2021

Jagan Two years Rule

 పంచడం..తుంచడం!

జగన్‌ పాలనకు రెండేళ్లు

May 30 2021


రెండేళ్ల పాలనలో ఏమున్నది గర్వకారణం?

నవరత్నాలు మినహా అన్నీ పక్కకే!

వ్యక్తిగత లబ్ధి.. రాజకీయ ప్రయోజనానికే ప్రాధాన్యం

రాజధాని అమరావతిని అటకెక్కించారు.. ‘మూడు’పై ముందుకుపోలేరు

నగరాలు, పరిశ్రమల అభివృద్ధికి మంగళం.. తాడేపల్లికే సీఎం పరిమితం

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమూ ‘రివర్స్‌’.. పోలవరం పరిస్థితిపై అనిశ్చితి

ప్రత్యేక హోదాపై ఎప్పుడో హ్యాండ్సప్‌.. నోరెత్తే నేతలపై కేసులు, అరెస్టులు

ఒక్కచాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చారు. ఐదేళ్లలో ఇప్పటికి రెండేళ్లు కరిగిపోయాయి. విభజన అనంతరం నవ్యాంధ్రగా ఏర్పడిన సీమాంధ్ర తొలి నాళ్లలో కన్న కలలన్నీ చెదిరిపోయాయి. కొత్త సర్కారు ప్రాధాన్యాలు మారిపోయాయి. రాజధాని అమరావతి లేదు. కొత్త పరిశ్రమలు లేవు. పెట్టుబడులు రావు. రెండేళ్ల పాలన గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే... అప్పులు తెచ్చి ‘సంక్షేమం’ పేరిట నగదు పంచడం, రాజకీయ ప్రత్యర్థులను రకరకాల కేసుల్లో అరెస్టు చేయడం! ఈ రెండింటిపైనే దృష్టి! ‘వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అను నేను’ అని ప్రమాణ స్వీకారం చేసి రెండేళ్లయిన సందర్భంగా ఒక విశ్లేషణాత్మక కథనం.... 

(అమరావతి- ఆంధ్రజ్యోతి)

వ్యక్తిగత లబ్ధి చేకూరే పథకాలను అమలు చేయడం.. అందులోనూ ఉత్పాదకత, ఉత్పత్తితో సంబంధంలేకుండా నేరుగా ఖాతాల్లోకే నగదు జమచేయడం.. ఓటు బ్యాంకును భద్రంగా చూసుకోవడం! సూటిగా చెప్పాలంటే... ఇదే రెండేళ్ల వైసీపీ పాలన సారాంశం! జగన్‌ పాలన కూల్చివేతలతోనే మొదలైంది. ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలోనే ప్రజా వేదికను కూల్చివేశారు. ఇది ఇప్పటిదాకా రాష్ట్ర ప్రజలు ఎరుగని అనుభవం. అవినీతి అధికారులు అక్రమ సంపాదనతో కట్టుకున్న భవనాలను బిహార్‌లో స్కూళ్లు, పాఠశాలలుగా మార్చారు. కానీ... స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే, ప్రజా ధనంతో నిర్మించిన ప్రజా వేదికను ప్రజల అవసరాల కోసం వాడుకునే అవకాశమున్నా... ‘అక్రమ నిర్మాణం’ అంటూ కూల్చివేయడం విస్మయపరిచింది. ఇక జరగబోయేది కట్టడం కాదు... కూల్చడమేనా అనే అనుమానాలకు అప్పుడే బీజాలు పడ్డాయి. మే 20వ తేదీన జరిగిన ఒకరోజు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశం సందర్భంగా.. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై తరహాలో రాష్ట్రంలో ఒక ప్రథమశ్రేణి నగరంలేదని సీఎం జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ... ఆ దిశగా నగరాలను అభివృద్ధి చేసే ప్రయత్నాలు మాత్రం జరగడంలేదు. రాష్ట్రంలో ‘కాస్మొపాలిటిన్‌’ లక్షణాలున్న ఏకైక నగరం విశాఖపట్నం! ఈ నగరాన్ని పర్యాటక, ఐటీ, వాణిజ్య రాజధానిగా మార్చేందుకు చేపట్టిన ప్రణాళికలన్నీ వైసీపీ సర్కారు పక్కన పడేయడం గమనార్హం. మరోవైపు... అభివృద్ధి అంటే నాలుగు భవనాలు నిర్మించడమేనా అంటూ ప్రభుత్వ పెద్దలు కొత్త వాదన తీసుకురావడం విశేషం. భవనాలు నిర్మించడం ఒక్కటే అభివృద్ధి కాకపోవచ్చు. కానీ... ఆర్థిక కార్యకలాపాలకు, కొత్త ఉపాధికి ఊతమిచ్చేది నగరాలే!

కేసులు... అరెస్టులు...

ప్రతిపక్ష నేతగా ఉండగా... ప్రభుత్వంపై జగన్‌, వైసీపీ నేతలు నిత్యం విరుచుకుపడేవారు. ఇక... సోషల్‌ మీడియాను ప్రధాన అస్త్రంగా వాడుకున్నారు. అధికారంలోకి వచ్చాక సోషల్‌ మీడియా పోస్టులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు పెడితే చాలు... సీఐడీ రంగంలోకి దిగుతోంది. రాత్రికి రాత్రి అరెస్టులు చేస్తోంది. ఇక... విపక్షంలో చురుగ్గా వ్యవహరించే నేతలపై రకరకాల కేసులు పెట్టడం, ఆందోళనలు చేయకుండా గృహనిర్బంధం చేయడం నిత్యకృత్యంగా మారింది. ఈ స్థాయి కక్ష సాధింపు చర్యలు గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ లేవని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

ప్రాజెక్టులు పార‘నీరు’

రాష్ట్రానికి జల జీవ నాడి... పోలవరం! 2021 జూన్‌ నాటికి పూర్తి చేస్తామని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. ఇప్పటి వరకూ కాఫర్‌ డ్యామ్‌ను మూసివేసే పనులు కూడా పూర్తి చేయలేదు. ఆ సంగతి పక్కనపెడితే... నీటినిల్వ గరిష్ఠ మట్టాన్ని 41.15 మీటర్లకు తగ్గించి పోలవరం జలాశయాన్ని ఒక సాధారణ బ్యారేజీగా మార్చే ప్రమాదం కూడా కనిపిస్తోంది. కొత్తగా మరో ఎత్తిపోతలను తెరపైకి తేవడం మరో అనుమానానికి దారి తీస్తోంది. కొత్త అంచనాల ప్రకారం నిధులు ఇచ్చేది లేదని కేంద్రం తేల్చి చెప్పినా... ఒత్తిడి తెచ్చి, నిధులను సాధించుకోలేని పరిస్థితి నెలకొంది. 

ఇంటికే పరిమితం...

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ జగన్‌ తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయానికే పరిమితమయ్యారు. క్యాబినెట్‌ సమావేశాలు ఉంటే మినహా... ‘సచివాలయానికి రాని సీఎం’గా పేరు తెచ్చుకున్నారు. జిల్లాల పర్యటనలు, జనంలోకి వెళ్లడం దాదాపుగా నిల్‌! ఇక... ముఖ్యమంత్రి అయ్యాక ఢిల్లీలో ఒకసారి మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత అమరావతిలోకానీ, ఢిల్లీలో కానీ మీడియాతో మాట్లాడిందే లేదు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు నీలం సంజీవరెడ్డి నుంచి నవ్యాంధ్ర తొలి సీఎం చంద్రబాబు వరకు ఎవ్వరూ ఈ తరహాలో ఇంటికి పరిమితం కాలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మాట తప్పినట్లేనా... 

ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ‘ప్రత్యేక హోదా- దాని ప్రయోజనాల’పై జగన్‌ మాట్లాడని రోజు లేదు. ఎన్నికల ప్రచారమంతా దాని చుట్టూనే సాగింది. అధికారంలోకి రాగానే... హోదా గాలిలో కలిసిపోయింది. ఈ రెండేళ్లలో కేంద్రంపై చిన్నపాటి ఒత్తిడి కూడా తెచ్చిన పాపాన పోలేదు. పైగా... ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లోనే హోదాపై జగన్‌ చేతులు ఎత్తేశారు. ‘‘బీజేపీకి మనతో అవసరం లేదు. సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి... విన్నపాలు చేసుకోవడంతప్ప మరో మార్గం లేదు’’ అంటూ విపక్షనేతగా ఉన్నప్పుడు చూపిన ‘పోరాట పటిమ’ను ఒక్కసారిగా పక్కనపెట్టేశారు. ఇది మాత్రమే కాదు! రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి అనేక అంశాలపై కేంద్రంపై ఒత్తిడి తేకుండా...లేఖలు రాసి వదిలేస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం ఒక ఉదాహరణ. ఇక... అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు సిబ్బందిని శాశ్వత ఉద్యోగులను చేస్తానన్న హామీ ని  మరిచిపోయారు. అధికారంలోకి రాగానే పాత పెన్షన్‌ ప ద్ధతి పునరుద్ధరిస్తామని, సీపీఎస్‌ రద్దుచేస్తామని చె ప్పారు. దీనిపై కేంద్రానికి లేఖ రాయడం మినహా చేసిందేమీ లేదు.

నవరత్నాల సర్కార్‌...

ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ‘నవరత్నాల’ను అమలు చేస్తే చాలు... ఇక అన్నీ చేసినట్లే అని సర్కారు భావిస్తోంది. ఆదాయం పెంచుకునే మార్గాలన్నీ వదిలేసి... అప్పులు తెచ్చి, పథకాలు అమలు చేయడపైనే దృష్టి సారించింది. ఊరికి, మండలానికి, జిల్లాకు, రాష్ట్రానికి పనికొచ్చే పనులు చేయకపోయినా... వ్యక్తిగత లబ్ధి చేకూర్చే పథకాలను అమలు చేయడం ద్వారా ‘సొంత ప్రతిష్ఠ’ను పెంచుకోవడమనే ఫార్ములా పూర్తిస్థాయిలో అమలవుతోంది. 

బాబు ముద్ర ఉండొద్దని..

నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు ముద్రను చెరిపివేయడమే లక్ష్యంగా కొత్త పాలన జరుగుతోందనే విమర్శలున్నాయి. చంద్రబాబు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ, ప్రజలను కలిసే ‘ప్రజా వేదిక’ కూల్చివేత అందులో భాగమే అనే విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత... ‘అమరావతి’నీ అటకెక్కించారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట పాలనా రాజధాని, శాసన రాజధాని, న్యాయ రాజధాని అంటూ మూడు ముచ్చట మొదలుపెట్టారు. ఇందులో ఉన్న శాసన, న్యాయపరమైన సంక్లిష్టతలు, రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం ఎలా చేస్తారో చెప్పకుండానే... ప్రకటన చేశారు. దీని ఫలితం... అటు అమరావతి మూలన పడిపోయింది. ఇటు మూడు రాజధానులూ ముందుకు కదలడంలేదు. ‘ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏది?’ అంటే... సమాధానం చెప్పుకోవడానికి తడుముకోవాల్సిన పరిస్థితి!


Friday, May 28, 2021

Jagan Bail - CBI & Central Government

 జగన్‌ బెయిలుపై సీబీఐ ఏమంటుంది? రద్దా.. వద్దా!?

May 29 2021

రఘురామ పిటిషన్‌పై ‘కౌంటర్‌’ ఏమిటి?

కేంద్రం ‘సూచన’లే సీబీఐకి కీలకం!?

జగన్‌తో కేంద్రం సంబంధాలకుసంకేతం

రద్దు చేయాలంటే తేడా వచ్చినట్లే

బెయిలుకే ఓకే అంటే ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’

ఒకటో తారీఖున తేలనున్న సంగతి

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్‌ బెయిలును రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ ఎలాంటి వైఖరి తీసుకుంటుంది? ‘ఔను... రద్దు చేయాలి!’ అంటుందా? లేక... ‘రద్దు చేయవద్దు.  బెయిలు నిబంధనలను ఆయన ఎంతమాత్రమూ ఉల్లంఘించడంలేదు’ అని చెబుతుందా? ఇది సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం. జగన్‌ బెయిలు రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జగన్‌తోపాటు సీబీఐ కూడా కౌంటర్‌ దాఖలు చేయాల్సి ఉంది. కానీ... లాక్‌డౌన్‌ పేరుతో జగన్‌ న్యాయవాది, ఉన్నతాధికారుల అభిప్రాయం తెలుసుకోవాలంటూ సీబీఐ లాయర్‌ కౌంటర్‌ వేయకుండా వాయిదా కోరారు. దీనిపై సీబీఐ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ... జూన్‌ 1లోపు కౌంటర్‌ వేయకుంటే, తామే పిటిషన్‌పై నేరుగా విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. అంటే... ఇక మూడు రోజులే గడువు! జగన్‌ కౌంటర్‌ విషయంలో ఎలాంటి గందరగోళమూ లేదు. ఎందుకంటే... బెయిలు రద్దు చేయవద్దనే ఆయన కోరుతారు. ఇక... సీబీఐ ఏం చెబుతుందన్నదే ప్రశ్న! కేంద్రం మనసులో మాట?: అధికారంలోకి రాకముందు నుంచే బీజేపీతో జగన్‌ సత్సంబంధాలు నెరుపుతున్న విషయం బహిరంగ రహస్యమే. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన అదే వైఖరి కొనసాగిస్తున్నారు. ప్రత్యేక హోదా మొదలుకుని, కొవిడ్‌ సమయంలో రాష్ట్రానికి ఆక్సిజన్‌/వ్యాక్సిన్‌ కేటాయింపు వరకు... ‘విన్నపాల’కు మాత్రమే పరిమితమవుతున్నారు. ప్రధానమంత్రిని జార్ఖండ్‌ ముఖ్యమంత్రి విమర్శించినా జగన్‌ ఊరుకోకపోవడం గమనార్హం. ‘రాజకీయ ప్రాధాన్యమున్న’ కేసుల్లో సీబీఐ సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో... జగన్‌ బెయిలు రద్దు పిటిషన్‌పై కేంద్రం ‘సూచనల’ ప్రకారమే నడుచుకునే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏం జరగవచ్చు...

దర్యాప్తు సంస్థలు నిందితుడికి వ్యతిరేకంగా వ్యవహరించడం సహజం. బెయిలు పిటిషన్లను వ్యతిరేకించడం, గరిష్ఠ శిక్ష విధించాలని కోరడం... ఇందులో భాగమే. ఈ విధంగా చూస్తే... జగన్‌ బెయిలును రద్దు చేయాలని సీబీఐ కోరాలి. అదే జరిగితే... పెద్ద సంచలనం అవుతుంది. జగన్‌పట్ల కేంద్రం వైఖరికి అదొక సంకేతంగా భావించవచ్చు. ఇక... సీబీఐ ముందున్న మరో ‘ఆప్షన్‌’, బెయిలు రద్దు చేయాల్సిన అవసరం లేదని చెప్పడం! ఇది ఒక దర్యాప్తు సంస్థగా సీబీఐ చేయకూడని పని. ఎందుకంటే... రఘురామరాజు తన పిటిషన్‌లో అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. అక్రమాస్తుల కేసులో సాక్షులను ప్రత్యక్షంగా, పరోక్షంగా బెదిరిస్తున్నారని.. బెయిల్‌ షరతులను ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. న్యాయస్థానం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. పలువురు సాక్షులు జగన్‌ ప్రభుత్వంలో అధికారులుగా ఉండటం, కొందరు సహ నిందితులు కీలక స్థానాల్లో ఉండటం, ఒకరికి సలహాదారు పదవి ఇవ్వడం, విజయసాయి రెడ్డి, అయోధ్య రామిరెడ్డిని రాజ్యసభకు పంపడం లాంటివన్నీ పిటిషన్‌లో వివరించారు. ప్రజాప్రతినిధుల కేసుల్లో విచారణ వేగవంతం చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను జీర్ణించుకోలేని వైసీపీ నేతలు న్యాయవ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఇంత నిర్దిష్టమైన అంశాలు పేర్కొన్నప్పటికీ... జగన్‌ బెయిలు రద్దు చేయకూడదనే వైఖరికే సీబీఐ కట్టుబడితే అది కేంద్రం ‘సూచనల’ మేరకే జరిగినట్లు భావించాల్సి ఉంటుంది. ఇది... కేంద్రంతో జగన్‌ సత్సంబంధాల ఫలితమే అని చెప్పవచ్చు. 

మౌన మార్గం...

జగన్‌ బెయిలు రద్దుకు ఎస్‌ లేదా నో చెప్పడంతోపాటు సీబీఐ ముందు మరొక ఆప్షన్‌ కూడా ఉంది. అదేమిటంటే... ‘ఈ విషయంలో మేం జోక్యం చేసుకోం. మీరే నిర్ణయం తీసుకోండి’ అని బంతిని సీబీఐ కోర్టులోకే నెట్టేయడం! అలాగే... అసలు కౌంటరే వేయకుండా మౌనం పాటించవచ్చు. ‘జూన్‌ 1వ తేదీ నాటికి కౌంటర్‌ వేయకపోతే నేరుగా పిటిషన్‌పై విచారణ చేపడతాం’ అని కోర్టు ఇప్పటికే చెప్పింది. ఆ తర్వాత... విచారణ సమయంలో సీబీఐ  అభిప్రాయాన్ని కోరే అవకాశముంటుంది. అది ప్రస్తుతానికి... అప్రస్తుతం! మొత్తానికి... జగన్‌ విషయంలో కేంద్రం మెతక వైఖరితో ఉందా, వ్యతిరేకత భావనతో ఉందా అనే విషయం మరో మూడు రోజుల్లో తేలిపోతుంది.

కొసమెరుపు: తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా బీజేపీ రాష్ట్ర సహ ఇన్‌చార్జి సునీల్‌ దియోధర్‌ బహిరంగంగా మాట్లాడుతూ... త్వరలో జగన్‌ బెయిల్‌ రద్దవుతుందని వ్యాఖ్యానించారు. దీని భావమేమిటో మరి!




Thursday, May 27, 2021

అధికార మదంతో ప్రభుత్వ టెర్రరిజం

 అధికార మదంతో ప్రభుత్వ టెర్రరిజం


May 28 2021

కరోనా విలయంలోనూ దాడులేనా?


కక్ష సాధింపుల గడ్డగా మార్చారు.. ప్రతి తప్పుడు కేసునూ మేమొచ్చాక సమీక్షిస్తాం


ఆ అధికారులపై ప్రైవేటు కేసులు వేస్తాం.. తప్పులు చేయిస్తున్నవారూ రక్షించలేరు


ఇప్పుడు అతి చేస్తున్న ప్రతి వైసీపీ నేతా ఇంతకింత చెల్లించుకుంటారు


కొవిడ్‌ వ్యాక్సిన్లకు డబ్బివ్వరు.. రంగుల ప్రకటనలకు మాత్రం వందల కోట్లు


కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో లాక్కుంటున్నారు.. అయినా సంక్షేమ భజన


చంద్రబాబు ఆగ్రహం.. మహానాడు తొలి రోజు ప్రసంగం

అమరావతి, మే 27 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ టెర్రరిజం అడుగడుగునా అధికార మదంతో తాండవమాడుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని వేధింపులు, కక్ష సాధింపులకు చిరునామాగా మార్చారని మండిపడ్డారు. ‘‘కరోనా విలయంలో వేల సంఖ్యలో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే వారి ప్రాణాలు కాపాడే బాధ్యతను గాలికి వదిలిపెట్టి రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేసి కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనేవారు లేక రైతులు అల్లాడుతుంటే పట్టదు. మాస్కులు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించిన వైద్యుడు ఈ లోకం వదిలి వెళ్ళేవరకూ వెంటాడి వేధిస్తారు. ఇదొక పాలనా? దీనికోసమేనా ఒక్క చాన్సు కావాలని ప్రజలను వేడుకుని అధికారంలోకి వచ్చింది’ అని నిలదీశారు. గురువారం ప్రారంభమైన టీడీపీ రెండు రోజుల డిజిటల్‌ మహానాడులో ఆయన తొలుత ప్రారంభోపన్యాసం చేశారు. రాజకీయ వేధింపుల తీర్మానంపై కూడా మాట్లాడారు. ‘తప్పుడు కేసులతో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర, జేసీ ప్రభాకర్‌ రెడ్డి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి వంటి టీడీపీ నేతలను అరెస్టు చేశారు. ఎంపీ రఘురామరాజును పోలీసు కస్టడీలో తీవ్రంగా కొట్టారు. సోషల్‌ మీడియాలో పోస్టు పెడితే కేసులు.. అరెస్టులు. ఆస్పత్రిలో రోగులను పరామర్శించడానికి వెళ్తే అరెస్టులు. మీడియాపై దేశ ద్రోహం కేసులు... సుప్రీంకోర్టు ఆదేశాన్ని కూడా లెక్కచేయకుండా అహంకారంతో పరిషత్‌ ఎన్నికలను పెడితే హైకోర్టు వాటిని రద్దు చేసింది. రాష్ట్రంలో ప్రజస్వామ్యం హతమారిపోతోందని కోర్టులు వ్యాఖ్యానించే పరిస్థితి వచ్చింది’ అని వ్యాఖ్యానించారు. 

ఇంకా ఏమన్నారంటే..చూస్తూ ఊరుకోవద్దు..

పోలీసులు అడ్డగోలుగా తప్పుడు కేసులు పెడితే టీడీపీ శ్రేణులు చూస్తూ ఊరుకోవద్దు. ఎదురు తిరిగి ప్రైవేటు కేసులు వేయాలి. ఈ విషయంలో పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. స్టేషన్లో కొడితే మేజిస్ట్రేట్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయండి. ఎంపీ రఘురామరాజు అలా చేయడం వల్లే పై నుంచి కిందవరకూ అందరూ ఇరుక్కుపోయారు. పోలీసులు కూడా ఆలోచించుకోవాలి. కరోనాతో మీ వాళ్లు కూడా వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. అయినా ప్రభుత్వానికి పట్టడం లేదు. మీతో తప్పులు చేయిస్తోంది. రేపు మిమ్మల్ని కాపాడేందుకు వాళ్లెవరూ ఉండరు. వైసీపీ నేతలకూ ఒక మాట గట్టిగా చెబుతున్నాం. గతంలో చూసీ చూడనట్లు ఊరుకున్నాం. ఇక ముందు సహించేది లేదు. అన్నీ వడ్డీతో చెల్లిస్తాం. సంక్షేమ పఽథకాల పేరుతో కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో అంతకు రెట్టింపు లాక్కుంటున్నారు. సామాన్యుల బతుకు దుర్భరం చేస్తున్నారు. ఆదాయాలు పడిపోయి ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఎక్కడా పనులు లేవు. అమరావతిని చంపేశారు. పరిశ్రమలు రావడం లేదు. ఉద్యోగాలు లేవు.  అప్పులపై బండి నడిపిస్తున్నారు. మూడు తరాలకు సరిపోను అప్పుల భారం  మోపుతున్నారు. రైతులకు రూ.87 వేల కోట్లు ఇచ్చామని కబుర్లు చెబుతున్నారు. పంట కొనే దిక్కే లేదు. రాష్ట్రంలో ఏ రైతు ఆనందంగా ఉన్నాడు? గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా అమ్మేశారు. దివాలా తీసిన వ్యక్తుల మాదిరిగా ఉన్నవన్నీ అమ్ముకుని బండి నడిపిస్తున్నట్లుగా ఉంది. 14 కొత్త వైద్య కళాశాలలు పెడుతున్నామని ప్రతి రోజూ చెబుతున్నారు. పెట్టడానికి నిధులు ఎక్కడున్నాయి? ఏం చేశారో చెప్పలేక ప్రతిపక్షాన్ని బూతులు తిట్టి పోతున్నారు. 

ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి

కరోనా సమయంలో పేదలకు, అవసరం ఉన్న వారికి పార్టీ నేతలు చేతనైనంత సాయం చేయాలి. చాలా కుటుంబాలు అనారోగ్యం బారిన పడి భోజనం సమకూర్చుకోలేక ఇబ్బంది పడుతున్నాయి. అటువంటి వారికి ఇళ్లకే భోజనం పంపండి. ఎక్కడైనా మీకు శక్తి లేకపోతే చెప్పండి. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా కొంత డబ్బు సమకూరుస్తాం. ట్రస్ట్‌ ద్వారా 600 మంది వరకూ ఆన్‌లైన్‌లో వైద్య సేవలు పొందారు. ఐదు వేల మంది వరకూ సేవలు పొందేలా విస్తరించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చినవారు అదే అధికారాన్ని ఉపయోగించుకుని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్నారు. మీడియాను, న్యాయవ్యవస్థనే బెదిరించడం.. ప్రతిపక్ష అభ్యర్థులపై దాడులు చేయడం దారుణమని యాక్షన్‌ ఫర్‌ డెమెక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) నివేదికలో పేర్కొన్నారు. వృత్తిలో అత్యున్నతంగా ఉన్నవారికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పదవి ఇస్తారు. కానీ ప్రభుత్వంలో అప్పుడే పదవీ విరమణ చేసినవారికి ఇచ్చారు. పరిషత్‌ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను అర్థం చేసుకోలేదు. చట్టవిరుద్ధంగా జారీచేసిన నోటిఫికేషన్‌ వల్ల రూ.120కోట్లు ఖర్చు. ఈ ముఖ్యమంత్రి ఆలోచన ఏంటో ఇలాంటి నియామకాలు, చర్యలతో అర్థం కావాలి.


ఆనందయ్యను రాచిరంపాన పెడుతున్నారు


సమాజ హితం కోరి తనకు తెలిసిన పరిజ్ఞానాన్ని నలుగురికి అందించాలని తపించిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యను వైసీపీ ప్రభుత్వం రాచిరంపాన పెడుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అంటూ ఒకరుంటే దీనిపై స్పందించాలని డిమాండ్‌ చేశారు. కరోనాపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఆనందయ్య విషయాన్ని ప్రస్తావించారు. ‘ఆయన్ను పోలీసులు తీసుకెళ్లి తమ అదుపులో ఉంచుకున్నారు. అధికార పార్టీ నేతలు ఆయనతో రహస్యంగా ఆ మందు తయారు చేయించి తమ వారికి పంచుకుంటున్నారు. ఇదేనా పాలన? ఆయన్ను ఇంటికి పంపండి. కావాలంటే అక్కడ పోలీసు కాపలా పెట్టుకోండి. ఆయన కుటుంబ సభ్యులను భయపెట్టవద్దు’ అని సూచించారు.

ఖలీల్‌ జిబ్రాన్‌ కవిత.. 

లెబనాన్‌ కవి ఖలీల్‌ జిబ్రాన్‌ కవితను చంద్రబాబు చదివి వినిపించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్ధితులకు ఇది అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. ‘ఎవరి నాయకులైతే అబద్ధాలకోరులవుతారో ఆ జాతిని చూసి జాలిపడదాం. నిజం చెప్పే ధైర్యం చచ్చిన మేధావులు, జాతి విద్వేషంతో రగులుతూ పరుల గాలిని సైతం సహించని మూకలున్న దేశాన్ని చూసి జాలిపడదాం. రక్తపాతం, చిత్రహింసలతో ప్రపంచాన్ని ఏలాలనుకునే బందిపోట్లను, రౌడీలను హీరోలుగా కొలిచే జాతిని చూస్తే జాలేస్తోంది. తమ హక్కులు తెంచుకుపోతున్నా.. తమ స్వేచ్ఛ కొట్టుకుపోతున్నా కిమ్మనని దేశాన్ని, ప్రజలను చూసి జాలిపడదాం’ అని ఆ కవితలో ఉంది.

అధికారంతో మిడిసిపాటు


May 28 2021

అన్నీ రాసి పెట్టుకుంటున్నాం.. వడ్డీతో బదులు తీరుస్తాం


మాకూ ఒక రోజు వస్తుందని గుర్తుంచుకోండి


వైసీపీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక


జనార్దన్‌రెడ్డి అరెస్టుపై ఆన్‌లైన్‌లో నిరసన దీక్ష


తప్పుడు కేసులు పెడితే పోలీసులపై ప్రైవేటు కేసులు


స్టేషన్లో కొడితే మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు


టీడీపీ అధినేత ఆగ్రహం

ఈ రోజు ఎవరెవరు ఏం చేశారో అన్నీ గుర్తు పెట్టుకుంటున్నాం. రాసి ఉంచుకుంటున్నాం. అణిచివేతను, కక్ష సాధింపును అనుభవించిన ప్రతి టీడీపీ నాయకుడు, కార్యకర్త దానికి బదులు తీర్చుకుంటారని గుర్తుంచుకోండి. 

రాయలసీమలో ఫ్యాక్షన్‌ రాజకీయాలు, ప్రతీకార రాజకీయాలు ఉండకూడదని టీడీపీ శ్రమించి పనిచేసి వాటిని రూపుమాపింది. కానీ ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత వేధింపు రాజకీయాలు మొదలయ్యాయి. 

 - చంద్రబాబు

అమరావతి, మే 26 (ఆంధ్రజ్యోతి): అధికారం చేతిలో ఉందని వైసీపీ నేతలు మిడిసిపడుతున్నారని.. వారి ప్రతి అరాచకానికీ వడ్డీతో బదులు తీరుస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా బుధవారం టీడీపీ నిర్వహించిన ఆన్‌లైన్‌ నిరసన దీక్షలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘అధికారం అండతో ప్రభుత్వ టెర్రరిజాన్ని ప్రదర్శిస్తున్నారు. నాయకులను అణచివేస్తే టీడీపీ ఉండదని భ్ర మిస్తున్నారు. ఎంత అణిచివేస్తే అంత బలంగా పోరాడే శక్తి టీడీపీ శ్రేణులకు ఉంది. గడియారం తిరుగుతూనే ఉంటుంది. ఒక రోజు మాకూ వస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ‘మనపై తప్పుడు కేసులు పెట్టిన వారిపై ప్రైవేటు కేసు వేసే హక్కు మనకు ఉంది. ఎంతవరకై నా వెళ్లి పోరాడదాం. స్టేషన్లో పోలీసులు కొట్టినా ఊరుకోవలసిన అవసరం లేదు. నిర్భయంగా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేయండి. అక్కడ న్యాయం జరగకపోతే ఇం కా పైకి వెళ్దాం. ఎంపీ రఘురామరాజును పోలీసు కస్టడీలో కొట్టించారు. ఆర్మీ ఆస్పత్రిలో నిజాలు బయటకు వచ్చి ముఖ్యమంత్రి బోనులో నిలబడ్డారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతివారూ పోరాడాలి. పోలీసుల్లో కొందరు మరీ అతిగా పోతున్నారు. వారందరినీ గుర్తు పెట్టుకుంటు న్నాం. ప్రభుత్వం మారితే మీ పరిస్థితేం టో ఆలోచించుకోండి. మీకు జీతాలు ఇస్తోంది ప్రజలు తప్ప వైసీపీ నేతలు కాదు. మరీ ఎక్కువ చేస్తే తర్వాత పశ్చాత్తాపపడాల్సి వస్తుంది’ అని ఆయన హెచ్చరించారు.

ఇంత చెత్త సీఎంను చూడలేదు..

కరోనా సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడే పనిని వదిలిపెట్టి రాజకీయ కక్ష సాధింపులపై జగన్‌రెడ్డి దృష్టి పెట్టి పనిచేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ తన రాజకీయ చరిత్రలో చాలా మంది ముఖ్యమంత్రులను చూసిందని, కానీ ఇంత చెత్త ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదన్నారు. ‘కరోనా వచ్చిన పేదలు, మధ్య తరగతి ప్రజలు చికిత్స కోసం అల్లాడుతున్నారు. డబ్బులు లేకపోతే ప్రాణాలు నిలబడే పరిస్థితి లేదు. పడకలు దొరకవు... ఆక్సిజన్‌ దొరకదు. ఇవేవీ ఈ సీఎంకు పట్టవు. ఉన్మాద పాలనకు కేరాఫ్‌ అడ్ర్‌సగా మారింది’ అని విమర్శించారు. కేసులు, అరెస్టులకు భయపడవద్దని...భయపడి ఇంట్లో దాక్కుంటే ఇంకా మీద పడతారని, అందరూ కలిసి తిరగబడితేనే వెనక్కి తగ్గుతారని పార్టీ శ్రేణులకు సూచించారు. బీసీ జనార్దన్‌రెడ్డి ఏనాడూ ఫ్యాక్షన్‌ రాజకీయాల జోలికి పోలేదని, సొంత డబ్బులతో నియోజకవర్గం అభివృద్ధికి పనిచేశారని గుర్తుచేశారు.



State Terrorism - TDP ఆంధ్రప్రదేశ్‘స్టేట్ టెర్రరిజం’ అంటూ ఏపీలో పాలనపై మహానాడులో తీర్మానం

 ఆంధ్రప్రదేశ్‘స్టేట్ టెర్రరిజం’ అంటూ ఏపీలో పాలనపై మహానాడులో తీర్మానం

May 27 2021

అమరావతి: టీడీపీ మొదటి రోజు మహానాడు కార్యక్రమం ముగిసింది. టీడీపీ మహానాడులో తొలి రోజు 6 తీర్మానాలపై చర్చించారు. ‘స్టేట్ టెర్రరిజం’ అంటూ ఏపీలో పాలనపై మహానాడులో తీర్మానం చేశారు. పాలన అంటేనే కేసులు, అరెస్టులుగా మారిందంటూ నేతల విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు రెండోరోజు మహానాడు నిర్వహిస్తారు. టీడీపీ అధికారంలోకి వచ్చినా పూడ్చలేని స్థాయిలో.. రాష్ట్రానికి నష్టం జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలు గమనించాలన్నారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది టీడీపేనని ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

టీడీపీ మహానాడు గురువారం ఉదయం ప్రారంభమైంది. మా తెలుగుతల్లి గీతాలాపనతో కార్యక్రమం మొదలైంది. గత మహానాడు నుంచి ఈ మహానాడు వరకు అసువులు బాసిన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలకు మహానాడు సంతాపం ప్రకటించింది.  సంతాప తీర్మానాన్ని గూడూరు ఎరిక్షన్ బాబు ప్రవేశపెట్టారు. రెండు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.